Living Lab: లివింగ్‌ ల్యాబ్‌.. ఓ అద్భుతం

రోజురోజుకూ వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది... మరి నియంత్రించేదెలా? నీటి నాణ్యతను లెక్కగట్టి ప్రజలకు సమాచారం చేరవేసేదెలా?

Published : 04 Dec 2021 12:22 IST

 గాలి కాలుష్యం.. నీటి నాణ్యతను  క్షణాల్లో పసిగట్టేస్తుంది
 సమాచారం సేకరించి.. అప్రమత్తం చేస్తుంది

కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో ట్రిపుల్‌ఐటీలో అందుబాటులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: రోజురోజుకూ వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది... మరి నియంత్రించేదెలా? నీటి నాణ్యతను లెక్కగట్టి ప్రజలకు సమాచారం చేరవేసేదెలా? ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ భావితరాలకు అందించేదెలా? ఇటువంటి నిత్య సవాళ్లకు సమాధానం చెబుతోంది గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ట్రిపుల్‌ఐటీ)లో ఏర్పాటు చేసిన లివింగ్‌ ల్యాబ్‌. 66 ఎకరాల విస్తీర్ణంలో గతేడాది డిసెంబరు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) సాయంతో ప్రతి సెకనుకు డాటా సేకరించి.. సమాచారాన్ని చేరవేస్తూ అప్రమత్తం చేస్తోంది. 

అలా మొదలైంది..

స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా లివింగ్‌ ల్యాబ్‌కు సహకారం అందిస్తున్నాయి. దీనిలో యూరోపియన్‌ బిజినెస్, టెక్నాలజీ సెంటర్‌(ఈబీటీసీ), ఆమ్‌స్టర్‌డామ్‌ ఇన్నొవేషన్‌ ఎరీనా(ఏఐఏ) భాగస్వామ్యులుగా ఉన్నాయి. గాలి కాలుష్యం, నీటి నాణ్యత, వనరుల వినియోగం, వాతావరణ పరిస్థితులపై ఐవోటీ పరిజ్ఞానంతో ప్రతి 15 సెకన్లకోసారి సమాచారాన్ని సేకరించి విశ్లేషించేలా ల్యాబ్‌ను తీర్చిదిద్దారు. వన్‌ఎం2ఎం సాంకేతికతను వినియోగించి డాటాను సేకరిస్తున్నారు. సిలికాన్‌ ల్యాబ్స్, ఇంటెల్‌ సైతం సహకారం అందిస్తున్నాయి.
సెన్సర్ల నుంచి సేకరించిన డాటాను వన్‌ఎం2ఎం సర్వర్‌ సాయంతో డ్యాష్‌ బోర్డుపై ప్రదర్శిస్తుంటారు. అమెజాన్‌ అలెక్సా ఇంటర్‌ఫేస్, ఇండియా అర్బన్‌ డాటా ఎక్స్ఛేంజీ యాప్‌లలో అందుబాటులోకి వచ్చేలా చూస్తారు. డాటా పరస్పరం మార్పిడికి బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)లోని ఇండియా అర్బన్‌ డాటా ఎక్స్ఛేంజీ(ఐయూడీఈఎక్స్‌) నిర్వాహకులతో భాగస్వామ్యం కానుంది.

కార్యకలాపాలు ఇలా.. 

ట్రిపుల్‌ఐటీలోని స్మార్ట్‌సిటీస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కింద లివింగ్‌ ల్యాబ్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. వర్సిటీ ప్రాంగణంలో 100 ఐవోటీ ఆధారిత సెన్సర్లను అమర్చి సమాచారం సేకరిస్తున్నట్లు ల్యాబ్‌ లీడ్‌ ఆర్కిటెక్ట్‌ అనురాధ వట్టెం తెలిపారు.

* సెన్సర్ల సాయంతో ప్రతి నిమిషానికోసారి నీటి నాణ్యత లెక్కించవచ్చు. ప్రతి నాలుగు గంటలకోసారి గాఢత, టీడీఎస్, పీహెచ్‌ స్థాయి తెలుసుకోవచ్చు. నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి గంటకోసారి వినియోగం ఎంతమేర జరిగిందో తెలుసుకునే వీలుంది.

* గాలి నాణ్యతను ప్రతి సెకనుకోసారి రికార్డు చేసి ప్రతి పది నిమిషాలకోసారి డ్యాష్‌బోర్డుపై   ప్రదర్శిస్తుంది. 

* వాతావరణ సెన్సర్ల సాయంతో వాయు వేగం, దిశ, ఉష్ణోగ్రత, తేమశాతం, వర్షపాతం, సూర్యకిరణాల రేడియేషన్‌ తెలుసుకోవచ్చు. కాలుష్యం సమాచారం తెలుస్తుంది.

* లోరావ్యాన్‌ సాంకేతికతతో ఇంధన వనరుల నిర్వహణకు ఉపయోగపడుతుంది.

* ప్రత్యేకంగా అమర్చిన కెమెరాల సాయంతో జన సమూహాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంది.

* దీపాలు, ఫ్యాన్లు, ఇతర పరికరాలకు విద్యుత్తు, సౌరశక్తి వాడకం తెలిసే వీలు కలుగుతుంది. 

* ఆక్యుపెన్సీ, కార్బన్‌ డై ఆక్సైడ్, ఏసీ, గాలి నాణ్యత సెన్సర్లను అమర్చి సాధారణ తరగతి గదులను స్మార్ట్‌గా మార్చారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని