Immunity against Corona: ఇమ్యూనిటీ వచ్చినా.. నిర్లక్ష్యం వద్దు!

కరోనా వైరస్‌పై ఎక్కువ మంది ఇమ్యూనిటీ సాధించినప్పటికీ సెకండ్‌ వేవ్‌ వంటి మరో విపత్తు రాకుండా ఉండాలంటే కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించవద్దని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Published : 25 Jul 2021 20:49 IST

హెచ్చరిస్తోన్న వైద్య నిపుణులు

దిల్లీ: దేశ జనాభాలో దాదాపు 60శాతం మందికిపైగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఈ మధ్యే విడుదలైన సర్వేలో తేలింది. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు జరుపుతోన్న సీరో సర్వేలోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై ఎక్కువ మంది ఇమ్యూనిటీ సాధించినప్పటికీ సెకండ్‌ వేవ్‌ వంటి మరో విపత్తు రాకుండా ఉండాలంటే కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించవద్దని వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చినా..!

దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు శరీర రోగనిరోధకశక్తిని (Immunity) పెంపొందించుకోవడమే ఏకైక మార్గం. ఇది సాధారణంగా వైరస్‌ బారినపడి కోలుకోవడం వల్ల లేదా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వృద్ధిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెజారిటీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు నివేదికలు వస్తున్నాయి. అయినా కొవిడ్ నియమావళి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని దిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని ఐసీయూ విభాగాధిపతి డాక్టర్‌ యుధ్యవీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై దిల్లీ ఇప్పటికే హెర్డ్‌ ఇమ్యూనిటి (Herd Immunity) సాధించిందని.. అయినా కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని డాక్టర్‌ సింగ్‌ స్పష్టంచేశారు. దేశంలో చాలా ప్రాంతాలు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించలేదని.. దీంతో వైరస్‌ ముప్పు ఇంకా పొంచివుందని గుర్తుచేశారు.

నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదు..

తీవ్రత తగ్గినట్లు కనిపించినా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందనే విషయాన్ని సెకండ్‌ వేవ్‌ మనకు నేర్పించిందని దిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రిలో సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ పూజా ఖోస్లా స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతున్న తీరును చూస్తున్నామని డా.పూజా గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో కార్యకలాపాలన్నీ పూర్తిస్థాయిలో తిరిగి తెరుచుకునే చర్యలు ఇబ్బందికరమైనవేనని అభిప్రాయపడ్డారు. ఇక మూడో ముప్పు తప్పదని.. దానికి కట్టడి చర్యలు ఏమేరకు తీసుకుంటామనే దానిపై ఆ ప్రభావం ఆధారపడి ఉంటుందని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీలోని ప్రొఫెసర్‌ ప్రజ్ఞా శర్మ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు వైరస్‌ బారినపడుతున్నప్పటికీ (Breakthrough Infection) ఆస్పత్రిలో చేరే ప్రమాదం మాత్రం తక్కువగానే ఉందన్నారు. కానీ, భౌతిక దూరం, మాస్కులపై నిర్లక్ష్యం వహించడం వల్ల మరో ముప్పునకు అవకాశం ఇచ్చినట్లేనని డాక్టర్‌ ప్రజ్ఞా శర్మ హెచ్చరించారు.

వైరస్‌ బారినపడి కోలుకోవడం వల్ల లేదా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఇప్పటికే దాదాపు 70 నుంచి 80శాతం మంది కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ సాధించారని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ జుగల్‌ కిశోర్‌ పేర్కొన్నారు. మరో 30శాతం మందికి వైరస్‌ సోకే ముప్పు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటికే డెల్టా ప్రభావాన్ని చవిచూశామని.. ఇలాంటి సమయంలో మరో కొత్తరకం వేరియంట్‌ పుట్టుకొస్తే మరో వేవ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని జుగల్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ఆంక్షల ఎత్తివేతతో చాలా ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని