
Omicron vs Delta: ఒమిక్రాన్లో డెల్టా కంటే రెట్టింపు మ్యుటేషన్లు..!
ప్రజలు అలసత్వం వహించవద్దని హెచ్చరించిన కేంద్రం
దిల్లీ: దేశంలో సెకండ్ వేవ్ సృష్టించిన విలయం కారణంగా వేల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితికి ప్రమాదకర డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు ఇప్పటికే తేల్చారు. ఇదే సమయంలో ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్లో డెల్టా రకం కంటే రెట్టింపు మ్యుటేషన్లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా సంక్రమణ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్న ప్రభుత్వం.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
‘ఇప్పటివరకు గుర్తించిన ఒమిక్రాన్కు సంబంధించిన అన్ని కేసుల్లో లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ తీవ్ర లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఒమిక్రాన్లో మొత్తం 45 నుంచి 52 మ్యుటేషన్లు జరిగితే.. అందులో 26 నుంచి 32 వరకు కేవలం స్పైక్ ప్రొటీన్లోనే చోటుచేసుకున్నాయి. ఇలాంటి మ్యుటేషన్లను ఆర్టీపీసీఆర్ పరీక్ష ద్వారా త్వరగా గుర్తించవచ్చు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే కణానికి అతుక్కుపోయే సామర్థ్యం ఈ రకానికి ఎక్కువగా ఉంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రజలు ఆందోళన చెందవద్దని.. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో ఈ వేరియంట్పై చేపట్టిన విశ్లేషణ ఆధారంగా.. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
యూరప్లోనే అధికం..
‘యూరప్లో కొవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజారోగ్య చర్యలపై హెచ్చరికలు చేస్తూనే ఉంది. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వల్లే యూరప్లో వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని కూడా డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. గతవారం జర్మనీలో 75వేల కేసులు, బ్రిటన్లో 47వేల కేసులు, ఫ్రాన్స్లో 50వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పోలిస్తే భారత్తో సహా మొత్తం 11 ఆగ్నేయాసియా దేశాల్లో గతవారం 1.2లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో ఇది కేవలం 3.1శాతమే. దీన్నిబట్టి చూస్తే ఆగ్నేయాసియా ప్రాంతంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గడం కనిపిస్తోంది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేసులు, మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేసింది.
ఇక కేరళ, మహరాష్ట్రలోనే కొవిడ్ తీవ్రత అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రెండు రాష్ట్రాల్లోనే ప్రస్తుతం 10వేల క్రియాశీల కేసులు ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 55శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.9శాతంగా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉండటంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది.