
జమ్మూకశ్మీర్లో మోదీ.. సైనికులతో దీపావళి వేడుకలు
శ్రీనగర్: ప్రతి ఏడాది వలే ఈ సారి కూడా ప్రధాని నరేంద్రమోదీ సైనికులతో దీపావళి పండగ జరుపుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వద్ద మోహరించిన బలగాలతో గురువారం ఉంటారు. దానిలో భాగంగా ఆయన ఇప్పటికే నౌషేరాకు చేరుకున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి సరిహద్దులోని భద్రతా బలగాలతోనే ఈ వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ జిల్లాలో ఇది రెండోసారి కావడం గమనార్హం.
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే నిన్న జమ్మూ చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా.. పూంచ్, రాజౌరీ ప్రాంతాల్లో గత మూడువారాలుగా ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటికే 11 మంది సైనికులు మరణించారు. మరోపక్క ఉగ్రవాదుల ఏరివేతకు బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో మోదీ పర్యటన సైనిక సిబ్బందిలో నైతికస్థైర్యాన్ని పెంచుతుందని సైనిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.