National Unity Day: భారత్‌కు.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం: మోదీ

అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Updated : 31 Oct 2021 16:35 IST

సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నివాళి

దిల్లీ: అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని అన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 146వ జయంతి సందర్భంగా వర్చువల్‌ పద్ధతిలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. భూమి, జలం, గగనతలాల్లో భారత్‌ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు. సర్దార్‌ పటేల్‌ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

‘భారత్‌ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో, వినయంగా ఉంటూ అందరినీ కలుపుకునేతత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్‌ పటేల్‌ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్‌ మారుతోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్‌ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్‌ పటేల్‌కు యావత్‌ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు. కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్‌ పటేల్‌ సజీవంగా ఉన్నారని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్‌ షా

దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్‌ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (Statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్‌ పటేల్‌ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌ షా ప్రసంగించారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌ను ఏకం చేయడానికి సర్దార్‌ పటేల్‌ చేసిన కృషిని అమిత్‌ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్‌ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలను విమర్శించిన ఆయన.. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని