Rafale: భారత్‌ కోరితే మరిన్ని రఫేల్‌ విమానాలను అందిస్తాం: ఫ్రాన్స్‌

భారత్​ అవసరాల మేరకు మరిన్ని రఫేల్​ విమానాలను అందించేందుకు ఫ్రాన్స్​ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్​ పార్లే ప్రకటించారు......

Published : 17 Dec 2021 22:55 IST

దిల్లీ: రఫేల్​ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్​ రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్​ అవసరాల మేరకు మరిన్ని రఫేల్​ విమానాలను అందించేందుకు ఫ్రాన్స్​ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ఫ్లోరెన్స్​ పార్లే ప్రకటించారు. భారత్​, ఫ్రాన్స్​ ఒకే రకమైన ఆయుధాలు వినియోగించడం రెండు వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల బలమైన బంధానికి అద్దం పడుతోందని ఆమె పేర్కొన్నారు. భారత్​-ఫ్రాన్స్​ సహకారంపై దిల్లీలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి  పాల్గొన్న పార్లే ఈ వ్యాఖ్యలు చేశారు. మేకిన్​ ఇండియాకు మద్దతు ఇచ్చేందుకు ఫ్రాన్స్​ కట్టుబడి ఉన్నట్లు ఫ్లోరెన్స్ స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు ఫ్లోరెన్స్​ పార్లే పేర్కొన్నారు. రఫేల్​ జెట్స్‌తో భారత వాయుసేన సంతృప్తిగా ఉండటం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సంక్లిష్ట సమయంలోనూ అనుకున్న సమయానికే 36 యుద్ధవిమానాలు భారత్​కు అందించడం గొప్ప ఘనతగా అభిప్రాయపడ్డారు. భారత్​కు ఇప్పటివరకు 33 రఫేల్​ జెట్లు అందించినట్లు ఫ్రాన్స్​ రాయబార కార్యాలయం గురువారం తెలిపింది.

నాలుగేళ్ల తర్వాత భారత అమ్ములపొదిలో..

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.59వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని  భారత్.. 2016 సెప్టెంబర్​లో కుదుర్చుకుంది​. కాగా ఈ విమానాలను ఫ్రాన్స్​కు చెందిన దసో ఏవియేషన్​ సంస్థ తయారు చేస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సుమారు నాలుగేళ్ల తర్వాత గతేడాది జులై 29న తొలి బ్యాచ్​లో 5 రఫేల్​లు భారత్​కు చేరుకున్నాయి. సెప్టెంబర్​ 10న అవి వాయుసేనలో చేరాయి. రెండో బ్యాచ్​లో మూడు రఫేల్​ విమానాలు 2020 నవంబర్​ 3న భారత్​కు చేరుకున్నాయి. మూడో బ్యాచ్​లో మరో 3 ఈ ఏడాది జనవరి 27న వాయుసేనలో చేరాయి. తొలి రఫేల్​ స్క్వాడ్రాన్​ను హరియాణాలోని అంబాలాలో ఏర్పాటు చేశారు. రెండో స్క్వాడ్రాన్​ను బెంగాల్​లోని బసిమారాలో ఏర్పాటు చేసేందుకు వాయుసేన ప్రణాళికలు చేస్తోంది.

మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు

రఫేల్​ ఒప్పందం భారత్​లో రాజకీయ వివాదంగా మారింది. మోదీ సర్కార్​పై విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై​ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఈ ఒప్పందంలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తోంది. పార్లమెంటులోనూ ఈ వ్యవహారంపై దుమారం చెలరేగింది. ఇదిలా ఉండగా.. భారత్​తో రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరేలా చూసేందుకు దసో ఏవియేషన్​ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్​కు చెందిన ‘మీడియాపార్ట్​’ జర్నల్​ నవంబర్​లో సంచలన వార్త ప్రచురించింది. ఇందుకోసం బోగస్ ఇన్‌వాయిస్​లు రూపొందించిందని వెల్లడించింది. ఓ మధ్యవర్తికి దసో ఏవియేషన్ 7.5 మిలియన్​ యూరోలు (రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్​వాయిస్​లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. బోగస్​ ఇన్​వాయిస్​కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్​ ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని