Corona: చిగురుటాకులా వణుకుతోన్న రష్యా..!

కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో ప్రజలు మృత్యు ఒడికి చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1,106 మంది ప్రాణాలు కోల్పోయారు.

Published : 26 Oct 2021 20:22 IST

రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదు

మాస్కో: కరోనా మహమ్మారి రష్యాను చిగురుటాకులా వణికిస్తోంది. నిత్యం 30 వేలకు పైగా కేసులు, వెయ్యి పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోతోంది. తాజాగా రికార్డు స్థాయిలో రోగబాధితులు మృత్యు ఒడికి చేరుకున్నారు. 24 గంటల వ్యవధిలో 1,106 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఆ దేశంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఇవే అత్యధిక మరణాలు కావడం గమనార్హం. నిన్న 36,446 మందికి వైరస్ సోకింది. మరో విషయం ఏంటంటే..  గణాంకాలను పరిశీలిస్తే, మనదేశంతో పోలిస్తే అక్కడ మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ ఏడు వరకు సెలవులు ప్రకటించింది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. మ్యూజియాలు, థియేటర్లు, కన్సర్ట్‌ హాల్స్‌ వంటి ప్రదేశాలకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రవేశం ఉంది. అదీ టీకా తీసుకున్న వారికి మాత్రమే. 

60 ఏళ్లు పైబడి, టీకా తీసుకోని వ్యక్తులు ఇంట్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారులను ఆదేశించారు. మాస్కుల వినియోగాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఒకవైపు కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. అక్కడి ప్రజలు వాటిని విహార యాత్రలతో సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విమాన టికెట్ల అమ్ముడయ్యాయని, హోటళ్లలో గదులు నిండిపోతున్నాయని, పర్యాటక ప్యాకేజీలకు డిమాండ్ పెరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఎక్కువమందికి టీకాలు తీసుకోకపోవడమే తాజా వైరస్ ఉద్ధృతికి కారణమని నిపుణులు అంటున్నారు. 146 మిలియన్ల జనాభాలో కేవలం 49 మిలియన్ల మంది మాత్రమే పూర్తిగా టీకా వేయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట టీకాను ఆవిష్కరించిన ఆ దేశంలో వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు అక్కడ 83 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. 2.3లక్షల మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని