Sonu Sood: కొత్త బాధ్యతల్లోకి ‘రియల్‌ హీరో’ సోనూసూద్

కొవిడ్ కల్లోలం వేళ.. ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు....

Updated : 27 Aug 2021 12:16 IST

‘దేశ్‌ కే మెంటార్స్’ అంబాసిడర్‌గా దిల్లీ ప్రభుత్వంతో పనిచేయనున్న సోనూ

దిల్లీ: కొవిడ్ కల్లోలం వేళ.. ఆపన్న హస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ ఇప్పుడు సరికొత్త బాధ్యతలు స్వీకరించారు. దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్, సోనూసూద్ పాల్గొన్నారు.

‘త్వరలో మా ప్రభుత్వం ప్రారంభించనున్న ‘దేశ్‌ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి సోనూసూద్‌జీ అంగీకరించారు’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడారు. ‘ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం నాకు దక్కింది. ఇంతకంటే గొప్పసేవ మరొకటి లేదు. మేం కచ్చితంగా కలిసి పనిచేస్తాం. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మేం ఎంతో మందిని కలుసుకున్నాం. అప్పుడే చదువు ఒక పెద్ద సమస్యగా ఉందని అర్థమైంది. పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని గ్రహించాం’ అని ఆయన తెలిపారు.

అలాగే రాజకీయాల్లో చేరిక గురించి ప్రశ్నించగా..‘‘మీరు మంచిపనులు చేస్తున్నారు, రాజకీయాల్లో చేరండి’ అని నాకు చాలామంది చెప్పారు. అందుకు తగ్గట్టే అవకాశాలూ వస్తున్నాయి. మంచిపని చేయడం కోసం వాటిలో చేరాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వాటి గురించి ఆలోచించడం లేదు. కేజ్రీవాల్‌జీతో జరిగిన సమావేశంలో కూడా ఆ ప్రస్తావన రాలేదు’ అని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని