Sonu Sood: రాజ్యసభకు రెండు పార్టీల నుంచి ఆఫర్‌: సోనూసూద్‌

తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినన్న సోనూసూద్‌.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు.

Published : 21 Sep 2021 01:35 IST

దిల్లీ: పన్ను ఎగవేత ఆరోపణలపై ప్రముఖ నటుడు సోనూసూద్‌ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను సోనూసూద్‌ మరోసారి ఖండించారు. తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినన్న ఆయన.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధంగా లేనందున వాటిని నిరాకరించినట్లు ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్‌ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా బహిరంగంగా వెల్లడిస్తానని సోనూసూద్‌ స్పష్టం చేశారు.

ఇక తనపై జరిగిన ఐటీశాఖ దాడులపై స్పందించిన సోనూసూద్‌.. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం తాజాగా ట్విటర్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో దేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్‌ సంస్థలకు సూచించాను. అలా, మా ప్రయాణం కొనసాగుతోంది’ అని సోనూసూద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని