South Africa: దక్షిణాఫ్రికాలో తగ్గుతోన్న కేసులు.. ముప్పు ముగిసినట్లేనా?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలిసారి వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది.

Updated : 22 Dec 2021 19:36 IST

ఒమిక్రాన్‌ ఉద్ధృతి గరిష్ఠానికి చేరుకుందని నిపుణుల అంచనా

జోహన్నెస్‌బర్గ్‌: యావత్‌ ప్రపంచాన్ని చుట్టుముడుతోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రపంచ దేశాలన్నీ మరోసారి కలవరపడుతున్నాయి. ఓవైపు యూరప్‌లో ఒమిక్రాన్‌ మరణాల సంఖ్య పెరగడం, మరోవైపు అమెరికాలోనూ ఈ వేరియంట్‌ కేసులు గణనీయంగా నమోదు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇలాంటి సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ తొలిసారి వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో మాత్రం కొవిడ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. దీంతో ఒమిక్రాన్‌ ఉద్ధృతి గరిష్ఠ స్థాయిని దాటినట్లేనని అక్కడి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

గరిష్ఠ స్థాయికి చేరుకుందా..?

కొవిడ్‌ పరీక్షల సామర్థ్యం, నమోదు ప్రక్రియ అంతంత మాత్రమే ఉన్న దక్షిణాఫ్రికాలో మొన్నటివరకు నిత్యం 30వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 27వేల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. ప్రధాన నగరాలైన గౌటెంగ్‌ ప్రావిన్సుతో పాటు జోహన్నెస్‌బర్గ్‌, ప్రిటోరియా నగరాల్లోనూ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా (మంగళవారం నాటికి) రోజువారీ కేసుల సంఖ్య 15,424కు పడిపోయింది. వేవ్‌కు ప్రధాన కేంద్రంగా మారిన గౌటెంగ్‌ ప్రావిన్సులో డిసెంబర్‌ 12న 16వేల ఇన్‌ఫెక్షన్లు నమోదుకాగా.. ప్రస్తుతం ఆసంఖ్య 3వేలకు తగ్గింది. ఇలా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండడం వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్న విషయాన్ని తెలియజేస్తోందని యూనివర్సిటీ ఆఫ్‌ విట్‌వాటర్స్‌రాండ్‌కి చెందిన సీనియర్‌ పరిశోధకురాలు మార్‌తా న్యూన్స్‌ పేర్కొన్నారు.

నవంబర్‌ రెండోవారం నుంచి దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్‌ ప్రావిన్సులో కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వైరస్‌ ఉద్ధృతికి కారణాలు అన్వేషించే పనిలో పడిన నిపుణులు వాటికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టారు. అందులో కొత్తవేరియంట్‌ను గుర్తించిన పరిశోధకులు వెంటనే ప్రపంచ ఆరోగ్యసంస్థకు సమాచారం అందించారు. అనంతరం ఆ ప్రావిన్సులో బయటపడిన మొత్తం కేసుల్లో 90శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే వెలుగు చూశాయి. ఇలా స్వల్ప కాలంలోనే దక్షిణాఫ్రికా మొత్తం విస్తృత ప్రాబల్యం కలిగిన వైరస్‌గా ఒమిక్రాన్‌ మారింది. రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో నవంబర్‌ 25న ఆందోళనకర వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. దీంతో ఒమిక్రాన్‌ ఉద్ధృతికి దక్షిణాఫ్రికా ఆరోగ్యవ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుందనే భయాలు నెలకొన్నప్పటికీ అటువంటి పరిస్థితులు లేకపోవడం ఊరట కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు.

కేసులు తగ్గినప్పటికీ..

‘ఈ వేవ్‌ స్వల్పకాలమే కొనసాగింది. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలకు సంబంధించి ఈ వేవ్‌ తీవ్రత చాలా తక్కువగానే ఉండడం ఊరట కలిగించే విషయం. నవంబర్‌లో వైరస్‌ వ్యాప్తి ఒక్కసారిగా పెరగడం ఊహించనిది కాదు. అదే క్రమంలో ప్రస్తుతం కేసుల సంఖ్య వేగంగానే తగ్గుతున్నాయి’ అని పరిశోధకురాలు మార్‌తా న్యూన్స్‌ పేర్కొన్నారు. క్రితం వారం వరకూ అక్కడ రోజువారీ కేసులు రెట్టింపు కాగా.. ప్రస్తుతం అవి తగ్గడం చూస్తుంటే వైరస్‌ వ్యాప్తి స్థిరంగానే ఉండిపోయిందని అర్థమవుతోందని ప్రొఫెసర్‌ వెరోనికా యుకెర్మెన్‌ పేర్కొన్నారు. ‘ఇలా క్రమంగా పెరుగుతూ.. అదే వేగంతో తగ్గడం ఈ వేవ్‌ ఉద్ధృతి తగ్గుదలకు సూచికమే. కేసులు తగ్గడం అతి ముఖ్యమైన పరిణామం. అయితే, వేవ్‌ ముప్పు ముగిసిపోయిందని చెప్పడం తొందరపాటే అవుతుంది’ అని మరో వైద్య నిపుణుడు డాక్టర్‌ ఫరీద్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. నవంబర్‌ మొదటివారంలో 2శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 29శాతం ఉన్న విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. అంటే వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఒక్కో దేశంలో ఒక్కోవిధంగా..

ఇక డెల్టాతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్ల వేగంతో వ్యాపిస్తోన్న ఈ వేరియంట్‌ ఇప్పటికే 89 దేశాలకు విస్తరించింది. తాజాగా అమెరికాలో ఒక మరణం చోటుచేసుకోగా గతవారం  అక్కడ నమోదైన కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉన్నట్లు తేలింది. మరోవైపు యూకేలోనూ ఒమిక్రాన్‌ విలయతాండవం చేస్తోంది. నిత్యం 10వేలకుపైగా ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌ ముప్పు ముగిసిపోయినట్లు ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటేనని అమెరికా, బ్రిటన్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వివిధ వయసుల వారి జనాభా, రోగనిరోధకశక్తి, వాతావరణ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయని.. వైరస్‌ వ్యాప్తి ప్రభావానికి ఇటువంటి వాటిపై ఆధారపడి ఉంటాయని గుర్తుచేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని