Sputnik V: స్పుత్నిక్‌ తయారీకి కేంద్ర బిందువుగా భారత్‌..!

స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) వెల్లడించింది.

Published : 01 Aug 2021 01:05 IST

సెప్టెంబర్‌ నుంచి భారీస్థాయిలో తయారీ - RDIF

దిల్లీ: స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే అవకాశాలున్నట్లు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌ (RDIF) వెల్లడించింది. దీంతో స్పుత్నిక్‌ తయారీకీ భారత్‌ అతిపెద్ద కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రెండో డోసు కొరత ఉందంటూ వస్తోన్న నివేదికలు ఆవాస్తవమని.. అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌ ఇదివరకే అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ ప్రస్తుతం ప్రైవేటులోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. అయితే, రెండో డోసు కొరత ఏర్పడిందని.. దీంతో తొలిడోసు తీసుకున్న వారికి ఆలస్యం అవుతోందనే వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆర్‌డీఐఎఫ్‌, అలాంటి నివేదికల్లో నిజం లేదని తెలిపింది. ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌, గ్లాండ్‌ ఫార్మా, హెటెరో బయోఫార్మా, పనేషియా బయోటెక్‌, స్టెలిస్‌ బయోఫార్మా, విర్కౌ బయోటెక్‌తో పాటు మోర్పెన్‌ ల్యాబ్‌లు స్పుత్నిక్‌ తయారీకి సన్నాహాలు చేస్తున్నాయని ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ నుంచి భారీ స్థాయిలో అందుబాటులో ఉంటాయని.. రానున్న రోజుల్లో స్పుత్నిక్‌ తయారీకి భారత్‌ కేంద్ర బిందువుగా మారనుందని అభిప్రాయపడింది.

స్పుత్నిక్‌తో పాటు సింగిల్‌ డోసులో రూపొందించిన ‘స్పుత్నిక్‌ లైట్‌’ను ఆగస్టులోనే భారత్‌కు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్‌డీఐఎఫ్‌ ప్రకటించింది. అయితే, రష్యాలో వైరస్‌ తీవ్రత పెరుగుతున్నందున భారత్‌కు దిగుమతికి ఆలస్యం ఏర్పడుతోందని డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ మధ్యే పేర్కొంది. ఆగస్టు చివరినాటికి ఈ పరిస్థితులు చక్కబడతాయని వెల్లడించింది. ఇదే సమయంలో సెప్టెంబర్‌ నుంచి భారత్‌లో స్పుత్నిక్‌ భారీ ఎత్తున అందుబాటులో వస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని