Covid: చైనాకు హెచ్చరిక.. సరిహద్దులు తెరిస్తే రోజుకు 6లక్షల కేసులు!

ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్‌ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.

Published : 29 Nov 2021 01:06 IST

‘జీరో కొవిడ్‌’ వ్యూహంపై తాజా అధ్యయనం

బీజింగ్‌: కొవిడ్‌ మహమ్మారితో కుదేలైన ప్రపంచ దేశాలు.. ఓవైపు కొవిడ్‌ను కట్టడి చేస్తూనే వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కానీ, కొవిడ్‌-19కు పుట్టినిల్లు చైనా మాత్రం ‘జీరో కొవిడ్‌ (కేసుల సంఖ్య సున్నాకు తీసుకురావడం)’ వ్యూహంతోనే ముందుకెళుతోంది. దీంతో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైనా.. లక్షల సంఖ్యలో కొవిడ్‌ టెస్టులు, పకడ్బందీ ట్రాకింగ్‌ చేపడుతోంది. ఇదే సమయంలో విదేశీ ప్రయాణాలపై ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ చైనా మాత్రం సరిహద్దులను మూసివేయాలనే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో అసలు సరిహద్దులు తెరిస్తే చైనాలో వైరస్‌ వ్యాప్తి ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని అంచనా వేసేందుకు అక్కడి పెకింగ్‌ యూనివర్సిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తల బృందం ఓ అధ్యయనం చేపట్టింది. ప్రయాణ ఆంక్షలను తొలగించి.. కొవిడ్‌ కట్టడికి ఇతర దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కొవిడ్‌ కేసులు బయటపడతాయని హెచ్చరించింది.

వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడే..

అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయెల్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లలో గడిచిన ఆగస్టులో ఉన్న కొవిడ్‌ విజృంభణ సమాచారాన్ని విశ్లేషించారు. ఆయా దేశాలు కొవిడ్‌ కట్టడికి అనుసరిస్తోన్న వ్యూహాన్ని చైనాలో అమలు చేస్తే ఫలితాలు ఎంటాయనే అంచనాలను రూపొందించారు. ఆగస్టు నెలలో అమెరికాలో నిత్యం లక్షా 50 వేల పాజిటివః కేసులు బయటపడ్డాయని.. అదే వ్యూహాన్ని పాటిస్తే చైనాలో నిత్యం 6.3లక్షల కేసులు వెలుగు చూస్తాయని హెచ్చరించారు. ఒకవేళ బ్రిటన్‌ వ్యూహాన్ని పాటిస్తే.. రోజుకు 2.75లక్షల కేసులు వెలుగు చూస్తాయని.. అదే ఫ్రాన్స్‌ విధానాన్ని అమలు చేస్తే నిత్యం 4.54 లక్షల కేసులు చైనాలో బయటపడతాయని హెచ్చరించారు.

పెకింగ్‌ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు రూపొందించిన తాజా అధ్యయనం చైనా సీడీసీలో ప్రచురితమైంది. మరింత సమర్థవంతమైన వ్యాక్సిన్‌లు, నిర్ధిష్ట చికిత్స లేకుండా సరిహద్దులను తెరవడం, బయటనుంచి రాకపోకలు సాగించేవారికి క్వారంటైన్‌ నిబంధనలను ఎత్తివేస్తే తీవ్ర ఇబ్బందులేనని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేస్తే వైద్యవ్యవస్థ తట్టుకునే స్థాయిలో చైనా లేదని పేర్కొంది. ఒకవేళ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను సడలిస్తే స్థానికంగా భారీ స్థాయిలో వైరస్‌ విజృంభణ ఉంటుందని.. ఇది చైనా ఆరోగ్య వ్యవస్థపై భరించలేని భారాన్ని మోపుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది.

మరో దారి లేదు..

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారీ సంఖ్యలో మ్యుటేషన్లకు గురౌతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావమున్న ఈ వేరియంట్‌తో మహమ్మారి నియంత్రణ, నిర్మూలనకు చేపడుతోన్న కార్యక్రమాలకు తీవ్ర సవాలుగా మారే ప్రమాదం ఉందని చైనాలోని ప్రముఖ శ్వాసకోశ నిపుణులు ఝాంగ్‌ నాన్‌షాన్‌ హెచ్చరించారు. ఇప్పటికే చైనాలో 76.8శాతం మందికి టీకా అందించామని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే లక్ష్యంతో 80శాతం మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అయితే, వైరస్‌ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతుండడం, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల రేటు 2శాతం ఉన్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు చైనాకు ‘జీరో కొవిడ్‌’ వ్యూహం తప్పించి మరోదారి లేదన్నారు.

ఇదిలాఉంటే, చైనాలో నిత్యం పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 23కేసులు నమోదు కాగా వాటిలో 20కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలోనే వెలుగు చూశాయి. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా అధికారులు నిర్దేశించిన హోటల్లో 21రోజులు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధన అమలు చేస్తున్నారు. ఇలా చైనాలో ఇప్పటివరకు 98,631 కేసులు మాత్రమే వెలుగు చూసినట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది. వారిలో 4636 మంది మృతి చెందినట్లు పేర్కొంది. ప్రస్తుతం 785 మంది చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని