Adar Poonawalla: అందుకు భారతీయులు అదృష్టవంతులు.. ఇప్పుడే బూస్టర్ డోసు అనైతికం..!

ఇప్పటికీ పలు దేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు కరోనా టీకాలు అందుబాటులేవని, ఈ సమయంలో బూస్టర్ డోసును ప్రారంభించడం అనైతికమని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టగా, మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. 

Published : 18 Sep 2021 16:00 IST

అభిప్రాయం వ్యక్తం చేసిన సీరం సీఈఓ పూనావాలా

దిల్లీ: ఇప్పటికీ పలు దేశాల్లో పూర్తి వ్యాక్సినేషన్‌కు కరోనా టీకాలు అందుబాటులో లేవని.. ఈ సమయంలో బూస్టర్ డోసును ప్రారంభించడం అనైతికమని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఇప్పటికే కొన్ని సంపన్న దేశాలు బూస్టర్ డోసు పంపిణీని మొదలు పెట్టగా.. మరికొన్ని దేశాలు ఆ దిశగా ప్రణాళికలు రచిస్తోన్న సంగతి తెలిసిందే.

‘అభివృద్ధి చెందుతున్న దేశాలు కేవలం 2 నుంచి 3 శాతం మాత్రమే టీకాలు పొందాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాక్సినేషన్ రేటు 40 నుంచి 50 శాతంగా ఉంది. ఈ సమయంలో బూస్టర్‌ డోసు సరికాదు. ప్రపంచదేశాలు గణనీయమైన స్థాయిలో రెండుడోసులు పొందిన తర్వాత.. అప్పుడు బూస్టర్‌ డోసు ఇవ్వడం గురించి ఆలోచించాలి’ అని పూనావాలా అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘వైరస్ ముప్పు పొంచి ఉన్న వ్యక్తులు, బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారికి మాత్రం ఈ డోసు ఇవ్వడం గురించి ఆలోచించొచ్చు. అలాగే కొవిషీల్డ్‌కు మూడో మోతాదు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లేవు. కొందరు ఈ డోసు తీసుకొని ఉండొచ్చు. మా నుంచి మాత్రం ఎలాంటి సిఫార్సు లేదు. డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం, కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆ డోసుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య దేశాలు దీనిపై ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు మన లక్ష్యం మాత్రం అందరికి రెండు డోసుల టీకా ఇవ్వడమే. భారత్‌లో టీకా తయారీదారులు ఉండటం మనందరి అదృష్టం. లేకపోతే మన పరిస్థితి కూడా ఆఫ్రికా దేశాల మాదిరిగానే ఉండేది’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని