Civil Services Results: సివిల్స్‌-2020 ఫలితాలు విడుదల 

సివిల్స్‌ -2020 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ తెలిపింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు....

Updated : 24 Sep 2021 23:00 IST

దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల నియామకం కోసం నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2020 తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 761 మందిని ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ వెల్లడించింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263 మంది జనరల్‌, 229 మంది ఓబీసీ, 122 మంది ఎస్సీ, 86 మంది ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్స్‌లో శుభం కుమార్‌ మొదటి ర్యాంకుతో మెరిశారు. జాగృతి అవస్థి రెండో ర్యాకు, అంకితా జైన్‌ మూడో ర్యాంకు సాధించారు. మేఘ స్వరూప్‌ 31వ ర్యాంకు సాధించారు. గత ఏడాది 98వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు.


సత్తాచాటిన తెలుగు అభ్యర్థులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులూ తమ సత్తా చాటారు. నలుగురు అభ్యర్థులు 100లోపు ర్యాంకులు సాధించారు. తెలుగు అభ్యర్థులు పి.శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు 27వ ర్యాంకు, రవికుమార్‌ 84వ ర్యాంకు, యశ్వంత్‌ కుమార్‌రెడ్డి 93వ ర్యాంకు, కె.సౌమిత్‌ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్‌ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్‌ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్‌రెడ్డి  747వ ర్యాంకు సాధించారు.  


అన్నదమ్ములిద్దరూ ఒకేసారి ఎంపిక..

పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన అన్నదమ్ములు సివిల్స్‌లో సత్తా చాటారు.  రాళ్లపల్లి జగత్‌సాయి 32వ ర్యాంకు, వసంత్‌ కుమార్‌ 170వ ర్యాంకు సాధించారు. వీరి తండ్రి భీమేశ్వరరావు విద్యుత్‌శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. గుండుగొలను గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఒకేసారి సివిల్స్‌కు ఎంపిక కావడం పట్ల గ్రామస్థుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు మెరిశారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్‌ ఐఐటీ బాంబేలో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్‌ నిట్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్‌ పూర్తి చేశారు. 


టీనాతో ఆమె సోదరి రియా (ఫొటో)

 ఈ ఏడాది జనవరి 8 నుంచి 17 వరకు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం శుక్రవారం సాయంత్రం తుది ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2015లో యూపీఎస్సీ సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన టీనా దాబి సోదరి రియా దాబి 15వ ర్యాంకు సాధించారు.


ఇష్టపడితే కష్టం కాదు..

‘‘మంచి ర్యాంకు సాధించాలని ప్రయత్నించాను. మొదటి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 20వ ర్యాంకు వస్తుందనుకోలేదు. నేను ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో మెడిసిన్‌ పూర్తి చేసి, 2019లో ఇంటర్న్‌ పూర్తి చేశాను. మెడికల్‌ సైన్స్‌ ఐచ్ఛికంగా సివిల్స్‌ రాశాను. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించాను. అఖిల భారత సర్వీసుల్లో చేరితే సమాజానికి ఎంతో చేయొచ్చని మా నాన్న చెప్పేవారు. మా అమ్మ నర్స్‌ కావడంతో హెల్త్‌ సెక్టార్‌లో ఎన్ని మార్పులు తీసుకురావచ్చో ఎప్పుడూ చెబుతుండేది. ఒక వైద్యురాలు సర్వీసెస్‌లో ఉంటే ఎలాంటి మార్పులు తీసుకురావచ్చే విషయాలు మా అమ్మ నుంచి తెలుసుకున్నాను. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. ఆరోగ్యం అనే కాకుండా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే సివిల్‌ సర్వీసెల్‌ ఒక ఉత్తమ మార్గం. మన అనుభవాలతో సమాజానికి ఎంతో మేలు చేసే అవకాశం లభించడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా జీవితంలో ఎదిగేందుకు సివిల్‌ సర్వీసెస్‌ అవకాశం కల్పిస్తుంది. నా తల్లిదండ్రులు, నా ట్యూటర్స్ కృషి వల్లే ఉత్తమ ర్యాంకు సాధించగలిగాను. సన్నద్ధత విషయంలో ఎప్పుడూ టైం లిమిట్‌ పెట్టుకోలేదు. నేను ఎంతో సరదాగా, ఇష్టంగా చదివాను.

- శ్రీజ (ఎంబీబీఎస్, సివిల్స్‌ 20వ ర్యాంకర్‌)


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు