WHO: థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ హెచ్చరిక!

కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ ......

Updated : 13 Sep 2022 15:03 IST

జెనీవా: కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు.  దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు వ్యాఖ్యానించించారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్‌ రేటు పెరగడం వల్ల కొన్ని నెలలుగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో తాజా తిరోగమన పరిస్థితులపై టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తంచేసినట్టు యూన్‌ న్యూస్‌ పేర్కొంది.  వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ 111 దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు. 

ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటివరకు ఏ వ్యాక్సినూ అందలేదని, ఇంకా చాలా దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు రాలేదన్నారు. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్‌ నాటికి కనీసం 10శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం జనాభాలో 40శాతం మందికి, 2022 మధ్యకాలం నాటికి  70శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని కోరారు. వ్యాక్సిన్‌ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన, సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో ఉంచడంతో పాటు సామూహిక సమావేశాలపై కట్టడిపై  సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరంఉందన్నారు. కఠిన నిబంధనలు అమలుచేయడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని