Gangster: 15 ఏళ్ల తర్వాత భారత్‌కు చిక్కిన మోస్ట్‌వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌

మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​.. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని అధికారులు భారత్​కు రప్పించారు......

Published : 16 Dec 2021 01:05 IST

ముంబయి: మహారాష్ట్ర, కర్ణాటకలో పలు దోపిడీ కేసుల్లో మోస్ట్​ వాంటెడ్​.. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్​ సురేశ్​ పూజారిని అధికారులు భారత్​కు రప్పించారు. ఫిలిప్పీన్స్​ నుంచి మంగళవారం రాత్రి భారత్​కు తీసుకొచ్చినట్లు సీనియర్​ పోలీస్​ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్​) పూజారిని బుధవారం దిల్లీలో తమ కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం పలు కేసుల్లో విచారణ నిమిత్తం ముంబయికి తరలించినట్లు తెలిపారు.

మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్​ నుంచి దిల్లీకి తీసుకొచ్చిన తర్వాత తొలుత ఇంటెలిజెన్స్​ బ్యూరో (ఐబీ), సీబీఐ అధికారులు సురేశ్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే దిల్లీ చేరుకున్న డీసీపీ రాజ్​కుమార్​ శిండే నేతృత్వంలోని ఏటీఎస్​ బృందం.. అతడిని కస్టడీలోకి తీసుకుని బుధవారం ఉదయం వాయుమార్గంలో ముంబయికి తీసుకొచ్చింది. అనంతరం కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరినట్లు తెలిపారు. ఏటీఎస్​ కస్టడీ పూర్తయ్యాక రాష్ట్ర రాజధానిలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ముంబయి, ఠాణె, కల్యాణ్‌​, ఉల్హాస్​నగర్​, దోంబివలిలో నమోదైన పలు దోపిడీ కేసుల్లో పూజారి మోస్ట్​వాంటెడ్​. ఈ క్రమంలోనే ముంబయి, ఠాణె పోలీసులు 2017, 2018 రెడ్​ కార్నర్​ నోటీసులు ఇచ్చారు. ఒక్క ఠాణె, ముంబయి పోలీసుస్టేషన్లతో పాటు కేవలం మహారాష్ట్రలోనే అతడిపై 24 కేసులు నమోదయ్యాయి. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న పూజారిని గత అక్టోబర్​లో ఫిలిప్పీన్స్​లోని భారత అధికారులు పట్టుకున్నారు. పూజారికి గ్యాంగ్​స్టర్​ రవి అత్యంత దగ్గరి బంధువు. అండర్​వరల్డ్​ డాన్​ చోటా రాజన్​తోనూ పూజారి పనిచేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని