Aryan Khan Case: వాంఖడేపై విచారణ ప్రారంభించిన ఎన్‌సీబీ

బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్‌ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌పై ఎన్‌సీబీ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు.

Published : 25 Oct 2021 13:24 IST

ముంబయి: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్‌ నుంచి డబ్బు డిమాండ్ చేశారనే ఆరోపణలపై తమ శాఖ జోనల్ డైరెక్టర్‌పై ఎన్‌సీబీ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఆ సంస్థ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు. ‘ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అది నా నేతృత్వంలోనే జరుగుతుంది’ అని చెప్పారు. తాము ఇప్పుడే విచారణ ప్రారంభించామని, వాంఖడే ఆ పదవిలో కొనసాగుతారా లేదా అని చెప్పడం తొందరపాటే అవుతుందన్నారు.  

సాక్షి విరోధిగా మారాడు: ఎన్‌సీబీ

షారుక్ నుంచి డబ్బు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ప్రభాకర్ సాయీల్ అనే ప్రత్యక్ష సాక్షి విరోధిగా మారాడని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. దీనిపై సోమవారం ఎన్‌సీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అలాగే తనపై వస్తోన్న ఆరోపణలపై ఆ సంస్థ జోనల్‌ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి తనను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు వస్తున్నాయని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని వాంఖడే కోర్టుకు తెలిపారు. ‘నా సోదరి, చనిపోయిన నా తల్లిని లక్ష్యంగా చేసుకొని కొందరు మాట్లాడుతున్నారు’ అని వెల్లడించారు. తనను బెదిరించి, దర్యాప్తును ఆటంకపరిచే ప్రయత్నాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాలని వాంఖడే అభ్యర్థించారు.

వాంఖడే నేతృత్వంలో ఈ నెల 2న రాత్రి ముంబయిలోని ఓ రేవులో నౌకలో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీపై ఎన్‌సీబీ దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇందులో అరెస్టయిన ఆర్యన్‌ జైల్లో ఉన్నాడు. ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9 మంది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్‌ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొచ్చాక శామ్‌ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, రూ.25 కోట్లు డిమాండ్‌ చేయాలని అతడికి చెబుతుండగా విన్నానని పేర్కొన్నారు. చివరకు రూ.18 కోట్లకు ఖరారు చేయమని, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని డిసౌజాకు గోసావి చెప్పాడన్నారు. ఆ తర్వాత గోసావి, డిసౌజాలను షారుక్‌ మేనేజర్‌ పూజా దద్లానీ కలిశారని చెప్పారు. గోసావికి ఇద్దరు వ్యక్తులు రూ.50 లక్షలు  ఇచ్చారని, అందులో రూ.38 లక్షలు తిరిగి ఇచ్చాడని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తనతో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణభయంతో తాను ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆరోపణల్ని ఎన్‌సీబీ తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే రెండు అఫిడవిట్లు దాఖలయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని