Mumbai Covid: ఊపిరిపీల్చుకున్న ముంబయి.. సున్నా కొవిడ్‌ మరణాలు నమోదు

గడిచిన 24గంటల్లో ముంబయి నగరంలో 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా సున్నా కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.

Updated : 18 Oct 2021 10:51 IST

అదుపులోకి వచ్చిన వైరస్‌ ఉద్ధృతి

ముంబయి: కరోనా వైరస్‌తో వణికిపోయిన దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం ముంబయి నగరంలో 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా సున్నా కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. కొవిడ్‌ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత తొలిసారిగా అక్కడ కొవిడ్‌ మరణాలు సంభవించకపోవడం (0 మరణాలు) ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా కొవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న నేపథ్యంలో ముంబయిలోనూ కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దేశంలో కరోనా వైరస్‌ ధాటికి విలవిలలాడిన ప్రాంతాల్లో మహారాష్ట్ర ముందువరుసలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముంబయి మహానగరం కొవిడ్‌ ఉద్ధృతికి వణికిపోయింది. సెకండ్‌ వేవ్‌ సమయంలో నిత్యం అక్కడ 11వేల కేసులు, వందల కొద్దీ మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు అక్కడ మొత్తం 7లక్షల 50వేల కేసులు నమోదయ్యాయి. వారిలో 16,180 మంది మృత్యువాతపడ్డారు. అయితే, గతకొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోన్న ముంబయిలో తాజాగా రోజువారీ మరణాల సంఖ్య 0కి చేరడం ఊరట కలిగించే విషయం.

ముంబయిలో గడిచిన 24గంటల్లో 28,600 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 367 కేసులు (1.27శాతం పాజిటివిటీ రేటు) బయటపడ్డాయి. దీంతో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 5030కి చేరింది. మరణాల సంఖ్య సున్నాగా నమోదయ్యింది. ప్రస్తుతం ముంబయిలో కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారి శాతం 97గా ఉంది. ప్రస్తుతం అక్కడ కంటెయిన్‌మెంట్‌ జోన్లు కూడా లేవని గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని