తమిళనాడులో ‘కరోనా దేవి’ ఆలయం

సెకండ్‌ వేవ్‌ రూపంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతిఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. .....

Published : 22 May 2021 01:31 IST

కోయంబత్తూరు: సెకండ్‌ వేవ్‌ రూపంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రోజూ లక్షల మందికి వ్యాపిస్తూ.. వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకొంటున్న ఈ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో కరోనా దేవి ఆలయం నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని వేడుకుంటూ 48 రోజుల పాటు రోజూ పూజలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. కోయంబత్తూరు శివారులోని ఇరుగుర్‌లో కామట్చిపురి అధినం ఆధ్వర్యంలో ఈ గుడిని నిర్మించారు. 1.5 అడుగుల నల్లరాతి విగ్రహాన్ని మఠం పరిసరాల్లోనే ఏర్పాటు చేశారు. దానికి కరోనా దేవిగా నామకరణం చేశారు. ప్రజల్ని రక్షించేలా చూడాలని ప్రార్థిస్తూ 48 రోజుల పాటు పూజలు నిర్వహించనున్నట్టు మఠం వర్గాలు వెల్లడించాయి. 

విపత్కర సమయాల్లో ఇక్కడ ఆలయాలు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ప్లేగు వ్యాధి వచ్చి అనేకమందిని పొట్టన పెట్టుకున్నప్పుడు కూడా జిల్లాలో మరియమ్మన్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి రోజూ పూజలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఈ స్థలం ప్లేగు మరియమ్మన్‌ ఆలయంగా ప్రసిద్ధి గాంచింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కరోనా దేవి ఆలయంలోకి పూజారులు, మఠం అధికారులను మాత్రమే అనుమతించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని