దేశంలో ఉగ్ర కుట్ర ప్రణాళికలు.. సోదాల్లో కీలక ఆధారాలు లభ్యం

ఉగ్రవాదుల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని 8 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి......

Published : 20 Feb 2022 01:47 IST

దిల్లీ: మరో భారీ ఉగ్ర కుట్ర బహిర్గతమైంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో దాడులకు పాల్పడేందుకు ఉగ్రమూకలు చేస్తున్న యత్నాలు బయటపడ్డాయి. ఉగ్రవాదుల కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌లోని 8 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యమైన పత్రాలు, సిమ్‌కార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కంప్యూటర్లు, డిజిటల్ స్టోరేజీ పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఎన్​ఐఏ భారీ కుట్ర కోణాన్ని గుర్తించింది. దాడుల కుట్ర కొంతకాలంగా కొనసాగుతోందని.. ముఖ్యంగా దిల్లీ, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల ప్రణాళికలు ముమ్మరంగా సాగుతున్నాయని ఎన్​ఐఏ స్పష్టం చేసింది.

భారత్‌లో భారీ దాడుల కోసం అనేక తీవ్రవాద సంస్థలు కలిసికట్టుగా ప్రణాళిక రచిస్తున్నాయని ఎన్‌ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అల్ బదర్, పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్ర సంస్థలు ఇందులో భాగమైనట్లు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌, కుప్వారా, షోపియాన్‌, రాజౌరీ, బుద్గాం, గందర్‌బల్‌తో పాటుగా రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఎన్​ఐఏ బృందాలు శనివారం తనిఖీలు నిర్వహించాయి.

దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురిపై నిఘా పెంచడంతో కీలక సమాచారం లభ్యమైందని ఎన్‌ఐఏ తెలిపింది. ఈ సోదాల్లో అనేక విషయాలు బయటపడుతున్నట్లు పేర్కొంది. ఉగ్రవాదుల కుట్ర కేసులో ఇప్పటికే 28 మంది నిందితులను అరెస్టు చేశామని, కేసు విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. వాగ్మూలం నమోదు కోసం కొందరికి, విచారణ కోసం మరికొందరికి త్వరలో నోటీసులు పంపనున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. నిందితులుగా గుర్తించిన వారిలో కొందరిని త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని