
Jammu Kashmir: కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
మృతుల్లో ఒకరు బిహార్వాసి హత్య కేసులో నిందితుడు
శ్రీనగర్: వరుస ఎన్కౌంటర్లతో జమ్మూ- కశ్మీర్ అట్టుడుకుతోంది. తాజాగా మంగళవారం షోపియాన్ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అయిదుగురు ముష్కరులు హతమయ్యారు. ఇందులో తుల్రాన్ ప్రాంతంలో జరిపిన ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరిలో ఒకరిని ముఖ్తార్ షాగా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్కుమార్ తెలిపారు. ఇటీవల శ్రీనగర్లో బిహార్ వాసి హత్య కేసులో ఇతను నిందితుడు అని వెల్లడించారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఫీరిపొరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మృతులను గుర్తించాల్సి ఉంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోన్నట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీలు ముమ్మరం..
కశ్మీర్ లోయలో ఇటీవల జరిగిన వరుస ఉగ్ర దాడుల్లో పలువురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల కట్టడికి భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే కశ్మీర్వ్యాప్తంగా దాదాపు 700 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. మరోవైపు సోమవారం పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన భద్రతా సిబ్బందిపై ముష్కరులు ఎదురుకాల్పులు జరిపిన ఘటనలో ఆర్మీ అధికారి సహా ఐదుగురు జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. బందిపొరా, అనంత్నాగ్లో నిర్వహించిన ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులూ హతమయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.