Rahul Gandhi: ఆ రోజు ఉగ్రవాదులు నన్ను చంపేసేవారే.. రాహుల్‌ గాంధీ

జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర చేస్తున్నప్పుడు తాను ఉగ్రవాదులను చూశానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఆ సయమంలో తాను సమస్యల్లో ఉన్నానని అన్పించిందని నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Published : 03 Mar 2023 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టారు. దాదాపు ఐదు నెలల పాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో యాత్ర సమయంలో ఆయనకు ఓ భయానక అనుభవం ఎదురైందట. ఆ సమయంలో ఉగ్రవాదులు తనను చంపేసేవారే అని రాహుల్ తాజాగా బయటపెట్టారు.

లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీ (Cambridge University)లో ‘21వ శతాబ్దంలో లెర్నింగ్‌ టు లిజన్‌’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన.. జోడో యాత్ర (Bharat Jodo Yatra) రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో ఎదురైన పరిస్థితులను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగే ముప్పు ఉందని.. అక్కడ పాదయాత్ర చేయొద్దని భద్రతా సిబ్బంది నాకు చెప్పారు. కానీ, నేను మా పార్టీవాళ్లతో మాట్లాడి.. యాత్రలో ముందుకెళ్లేందుకే నిశ్చయించుకున్నా. అలా నడుస్తున్నప్పుడు.. ఒకసారి ఓ గుర్తుతెలియని వ్యక్తి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలని చెప్పాడు. కాంగ్రెస్‌ నేతలు నిజంగానే జమ్మూకశ్మీర్‌కు వచ్చి ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అని అడిగాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ వ్యక్తి.. కాస్త దూరంగా ఉన్న కొంతమందిని చూపిస్తూ ‘వాళ్లంతా ఉగ్రవాదులు’ అని చెప్పాడు. ఆ సమయంలో నేను నిజంగానే సమస్యల్లో ఉన్నానేమోనని అన్పించింది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఆ ముష్కరులు నన్ను చంపేసేవారే. కానీ అలా చేయలేదు. లిజనింగ్‌కు ఉన్న శక్తి అది’’ అంటూ రాహుల్‌ (Rahul Gandhi) నాటి సంఘటనను వివరించారు. ప్రజా సమస్యలు వినడానికి వచ్చానన్న కారణంతోనే వాళ్లు తనపై దాడి చేయలేదన్న అభిప్రాయాన్ని రాహుల్‌ వ్యక్తం చేశారు.

గతేడాది సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్‌ ఈ జోడో యాత్ర (Bharat Jodo Yatra) చేపట్టారు. 12 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర చేసి ఈ ఏడాది జనవరి 30న కశ్మీర్‌లో ముగించారు. కశ్మీర్‌లోకి జోడో యాత్ర ప్రవేశించినప్పుడు భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యాయి. భద్రతా సిబ్బంది లేకపోవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆ మధ్య కాంగ్రెస్‌ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని