
Archana Gautam: ‘బికినీ గర్ల్’పై రాజకీయ దుమారం
మేరఠ్: ఉత్తర్ప్రదేశ్లో ‘బికినీ గర్ల్’ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రముఖ మోడల్, నటి అర్చనా గౌతమ్ గతంలో మిస్ బికినీ ఇండియా పోటీల్లో విజేత నిలిచారు. తర్వాత నటిగా పలు సినిమాల్లో టీవీ సీరియళ్లలో నటించారు. తాజాగా ఆమెను మేరఠ్లోని హస్తినాపుర్ నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై భాజపా, హిందూ మహాసభ మండి పడుతున్నాయి. చౌకబారు ప్రచారాల కోసం అర్చనా లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని భాజపా నేత రాకేశ్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. ఆమెకు అవకాశం ఇవ్వడం వెనక ప్రజాసేవ అనే భావనే లేదని త్రిపాఠి విమర్శించారు.
మానసికంగా దివాలా తీసిన పార్టీ నుంచి గొప్ప పనులను ఆశించలేమని అఖిల భారత హిందూ మహాసభ, సంత్ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి వ్యాఖ్యానించారు. హస్తినాపుర్ ప్రాంతం పవిత్రమైనదని చక్రపాణి చెప్పుకొచ్చారు. అర్ధనగ్నంగా ఫొటోలను పోస్ట్ చేసే ఈ మహిళ వ్యవహార తీరు వల్ల.. ఈ పవిత్ర ప్రాంతంలో నివసించే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. అయితే, భాజపా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న కళాకారిణికి అవకాశం ఇవ్వడంలో తప్పేంటని ప్రశ్నించింది. భాజపాలోనూ చాలా మంది నటులు, కళాకారులు ఉన్నారని, అందులో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది