Odisha Train Tragedy: అంతా 20 నిమిషాల వ్యవధిలోనే.. నిద్రలోనే మృత్యుఒడిలోకి..!

Coromandel Express Accident: ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మాటలకందని విషాదాన్ని నింపింది. ఈ ఘటన కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయిందని స్థానికులు వెల్లడించారు. 

Updated : 03 Jun 2023 10:10 IST

బాలేశ్వర్‌: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొనడం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రయాణికులు గాయపడగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే పట్టాలపై ఈ భారీ విషాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. (Odisha Train Tragedy)

రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యలో ఈ ఘోరం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది.

ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా చాలా మంది పట్టాల మధ్యలో చిక్కుకొని ఉన్నారని అధికారులు తెలిపారు. వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రమాదం సమయంలో రెండు రైళ్లు అతి వేగంతో ప్రయాణించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రక్తదానం కోసం బారులు..

పట్టాలపై చోటుచేసుకున్న విషాదంతో వందల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. స్థానికులు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సమయంలో రక్తదానం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. బాలాసోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని