India-China: చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే..

సరిహద్దుల్లో చైనాతో పరిస్థితులు ఇంకా సంక్లిష్టంగా, ప్రమాదకరంగానే ఉన్నాయని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నారు. ఈ ప్రతిష్టంభనను పరిష్కరించాల్సిన బాధ్యత బీజింగ్‌దేనని తెలిపారు.

Published : 18 Mar 2023 15:43 IST

దిల్లీ: వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ.. భారత్ (India), చైనా (China) మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar). హిమాలయ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం.. ‘అసాధారణ, సవాళ్ల దశ’కు చేరుకుందని తెలిపారు. దిల్లీలో శనివారం జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. (India China Border Issue)

‘‘భారత్‌, చైనా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ విషయంలో ఇరు దేశాలు గణనీయమైన పురోగతి సాధించాయి. ఇతర ఘర్షణ ప్రాంతాల వద్ద సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ.. హిమాలయాల్లోని సరిహద్దుల్లో చైనాతో పరిస్థితులు ఇప్పటికీ పెళుసుగా, ప్రమాదకరంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల బలగాలు పరస్పరం అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయి’’ అని జైశంకర్‌ (S Jaishankar) వెల్లడించారు. ఇరు దేశాల మధ్య బంధం ముందుకెళ్లాలంటే.. ఈ సరిహద్దు ప్రతిష్టంభన (Border Issue)ను చైనానే పరిష్కరించాలని కేంద్రమంత్రి తెలిపారు.

రాహుల్‌పై విమర్శలు..

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చైనాను చూసి భయపడుతోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై జైశంకర్‌ ఘాటుగా స్పందించారు. ‘‘చైనాపై రాహుల్‌ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదో పెద్ద తయారీదారు అని.. మేక్‌ ఇన్‌ ఇండియా పని చేయదు అని విమర్శిస్తున్నారు. ఒక దేశం గురించి ఎలాంటి అభిప్రాయలైనా ఉండొచ్చు. కానీ, జాతి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరి కాదు. అలాంటి వారిని చూసినప్పుడు ఓ భారతీయుడిగా నేను ఇబ్బందిపడుతున్నా’’ అని విదేశాంగ మంత్రి రాహుల్‌ను దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు