520 అణుబాంబులతో ప్లాన్-బి
ప్రపంచలోనే అతిపెద్ద ఓడల్లో ఒకటైన ఎవర్ గివెన్ సూయిజ్ కెనాల్కు అడ్డంపడటంతో ప్రపంచ వాణిజ్యం దాదాపు స్తంభించినంత పనైంది.
* సూయిజ్కు ప్రత్యామ్నాయంపై గతంలో అమెరికా ప్రతిపాదన
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రపంచంలోనే అతిపెద్ద ఓడల్లో ఒకటైన ‘ఎవర్ గివెన్’ సూయిజ్ కెనాల్కు అడ్డంపడటంతో ప్రపంచ వాణిజ్యం దాదాపు స్తంభించినంత పనైంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రపంచానికి ప్లాన్-బి ఏమిటీ అనే చర్చ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఇటువంటి చర్చే కొన్ని దశాబ్దాల క్రితం కూడా జరిగింది. అప్పట్లో తన మిత్రదేశం ఇజ్రాయెల్-ఈజిప్టు మధ్య సంబంధాలు దెబ్బతినడం.. సూయిజ్ కాల్వ బ్రిటన్ పెత్తనం నుంచి చేజారిపోవడంతో అమెరికా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఓ విచిత్రమైన ప్రతిపాదనను పరిశీలించింది. కొన్ని వందల అణుబాంబులను వాడి ఇజ్రాయెల్లోని నెగెవా ఎడారిలో భారీ కాల్వను నిర్మించాలని భావించింది.
భారీ ప్రణాలిక..
మధ్యధరా సముద్రాన్ని ఓ కాల్వతో గల్ఫ్ ఆఫ్ అకాబాతో కలపాలన్న ప్రతిపాదన 1963లో అమెరికా పాలకుల ముందుకు వచ్చింది. ఇలా చేస్తే మధ్యధరా సముద్రం-ఎర్ర సముద్రం అనుసంధానమవుతాయి. జనావాసాలు అత్యంత తక్కువగా ఉండే నెగెవా ఎడారిని దీనికి ఎంచుకున్నారు. దాదాపు 1500 అడుగుల లోతుతో దీనిని నిర్మించాలని భావించారు. ఇలా దాదాపు 130 మైళ్ల పొడవు కాల్వ నిర్మించాలి. ఈ స్థాయి తవ్వకాలకు ఒక్కో మైలుకు రెండు మెగాటన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు అణుబాంబులను భూమి అడుగున అమర్చి పేల్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన 520 అణుబాంబులను వాడాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. ఈ మొత్తం అణుబాంబుల శక్తి 1.04 గిగాటన్నులకు సమానం.
రాజకీయ అంశాలను విస్మరించి..
సాంకేతికంగా ఇది సాధ్యమే అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తాయనే అంశాన్ని మాత్రం విస్మరించారు. అంతేకాదు శాంతియుత ప్రయోజనాలకు అణు విస్ఫోటాల వినియోగం అనే అంశం కింద దీనిని ప్రతిపాదించారు. మధ్య అమెరికాలో పలు కాల్వలు ఇలా నిర్మించాలనుకున్నారు. అయితే, దాదాపు 27 ప్రయోగాలు జరిపాక అమెరికా అటామిక్ ఎనర్జీ కమిషన్ ఓ విషయాన్ని గుర్తించింది. అణువిస్ఫోటాలు జరిపే చోట భూమి అత్యధికంగా రేడియేషన్ బారిన పడతుందని తేల్చింది. 1974లో ఈ ప్రతిపాదనను పూర్తిగా పక్కన పడేశారు. 1996లో అమెరికా ఈ ప్రతిపాదనలను బహిర్గతం చేసింది.
1956 యుద్ధమే కారణం
సూయిజ్ కెనాల్ కంపెనీని ఈజిప్ట్ బలవంతంగా జాతీయం చేయడంతో గుర్రుగా ఉన్న ఫ్రాన్స్, బ్రిటన్లు ఇజ్రాయెల్ను రెచ్చగొట్టి తొలుత దాడి చేయించాయి. తర్వాత రంగంలోకి దిగి ఈజిప్ట్ను ఓడించాయి. దీంతో ఈజిప్ట్ సూయిజ్ కాల్వలో కొన్ని నౌకలను ముంచేసింది. మరోపక్క ఐరాస, అమెరికా జోక్యం చేసుకొని ఇజ్రాయెల్, ఫ్రాన్స్,బ్రిటన్లను వెనక్కి వెళ్లాలని హెచ్చరించింది. వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ స్టెర్లింగ్ విలువను కుప్పకూల్చింది. దీంతో బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫలితంగా పశ్చిమ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన దేశంగా అమెరికా అవతరించింది. మరోపక్క సూయిజ్ కాల్వలో ప్రయాణం కొన్ని నెలల పాటు ఆగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా సూయిజ్ కాల్వకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ ప్రతిపాదనను పరిశీలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!