ఆ 4 రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ వైరస్‌ను తరిమికొట్టగల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత విస్తరించింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు

Published : 21 Apr 2021 17:47 IST

భోపాల్‌/రాయ్‌పుర్‌: దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ వైరస్‌ను తరిమికొట్టగల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత విస్తరించింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ఉత్తరప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి. 

మధ్యప్రదేశ్‌లో 18ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి ఉచితంగా టీకాలు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. 18ఏళ్లు పైబడిన వారందరి టీకా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ వెల్లడించారు. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్న ఆయన.. వ్యాక్సిన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని కేంద్రాన్ని కోరారు.

వ్యాక్సిన్‌ కొనుగోలులో రాష్ట్రాలకు స్వేచ్ఛ కల్పిస్తూ కేంద్రం గత సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టీకా తయారీదారులు... 50% ఉత్పత్తిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయడానికి అనుమతి కల్పించింది. అంతేగాక, 18ఏళ్ల పైబడిన వారందరూ మే 1 నుంచి టీకాలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే సీరమ్‌ సంస్థ కొవిషీల్డ్‌ టీకా ధరలను నేడు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయించనున్నట్లు తెలిపింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని