Asaduddin Owaisi: వాళ్లే నేడు నాపై దాడి చేశారు: ఒవైసీ

అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు......

Published : 06 Feb 2022 02:12 IST

లఖ్‌నవూ: ఎన్నికల వేళ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. తనపై వాహనంపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఆయన శనివారం భాగ్‌పత్‌ జిల్లా ఛప్రౌలిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల ఘటన తర్వాత మొదటిసారి ఓ ర్యాలీలో భాగమయ్యారు. ఈ సందర్భంగా దాడి గురించి మాట్లాడారు. అప్పట్లో మహాత్మా గాంధీని చంపినవారే నేడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.

‘ఒకప్పుడు గాంధీని హత్యచేసినవారే నేడు నాపై దాడికి పాల్పడ్డారు’ అంటూ ఒవైసీ పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారికి భాజపాతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘నాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. కానీ అల్లా నన్ను రక్షించాడు’ అని తెలిపారు.

యూపీలోని మేరఠ్ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద అసదుద్దీన్‌పై కాల్పులు జరిగాయి. అనంతరం షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారని పేర్కొన్నారు. తామంతా సురక్షితంగా బయటపడినట్టు అసదుద్దీన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఒవైసీకి ‘జడ్‌’ కేటగిరీ భద్రతను కల్పించగా దాన్ని ఆయన తిరస్కరించారు. తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని.. ఆంక్షల మధ్య కాదని పేర్కొన్నారు. తనపై కాల్పులు జరిపిన వ్యక్తులు, వారిని ఉసిగొల్పిన వారిపై ఉపా  చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని