SpiceJet: స్నేహితుల ‘ప్రేమ’ కోసం.. విమానంలో బాంబు ఉందంటూ ఫోన్‌

స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానానికి నకిలీ బాంబు బెదిరింపు ఘటనలో దిల్లీ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు తన బాల్య స్నేహితుల ప్రేమ కోసమే ఈ నాటకమాడినట్లు తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.

Published : 14 Jan 2023 14:26 IST

దిల్లీ: స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌ ఇటీవల దిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం సృష్టించింది. అయితే అది నకిలీ బెదిరింపు అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే నకిలీ కాల్‌ (Hoax Bomb Call) చేయడం వెనుక కారణం తెలిసి అధికారులు అవాక్కయ్యారు. నిందితుడు తన స్నేహితుల ‘ప్రేమ’ కోసం విమానంలో బాంబు ఉందంటూ ఉత్తుత్తి బెదిరింపులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గత గురువారం రాత్రి దిల్లీ (Delhi) నుంచి ఓ స్పైస్‌జెట్‌ (SpiceJet) విమానం పుణె (Pune) వెళ్లడానికి సిద్ధంగా ఉండగా ఎయిర్‌లైన్‌ కాల్‌ సెంటర్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందని ఆగంతకుడు చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ (CISF) కంట్రోల్‌ రూంకు సమాచారమందించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే విమానాన్ని నిర్మానుశ్య ప్రాంతానికి తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఆ బెదిరింపు ఉత్తుత్తిదే అని అధికారులు తేల్చారు.

అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ ట్రైనీ టికెటింగ్‌ ఏజెంట్‌ అభినవ్‌ ప్రకాశ్ ఈ ఫోన్‌ కాల్‌ చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతడిని అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రకాశ్ బాల్య స్నేహితులైన రాకేశ్‌, కునాల్‌కు ఇటీవల మనాలీ ట్రిప్‌లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు యువతులతో పరిచయం ఏర్పడింది. గురువారం ఆ అమ్మాయిలిద్దరూ స్పైస్‌జెట్‌ విమానంలో పుణె వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాకేశ్, కునాల్‌.. ప్రకాశ్‌ను సాయం కోరారు. తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో మరింత సమయం గడిపేందుకు ఎలాగైనా విమానాన్ని ఆలస్యం చేయాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాము ముగ్గురం కలిసి ఈ బాంబు నాటకం ఆడామని ప్రకాశ్ పోలీసు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం ప్రకాశ్‌ స్నేహితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని