Jagdeep Dhankar: ఆటంకాలకు ముగింపు పలకండి.. ఎంపీలతో ఉప రాష్ట్రపతి

పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగేలా ఆటంకాలను ఆయుధాలుగా మలచుకునే వ్యూహానికి ముగింపు పలికేందుకు ఇదే సరైన సమయమని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు.

Published : 19 Sep 2023 14:06 IST

దిల్లీ: నేటి నుంచి కొత్త పార్లమెంటు భవనం (New Parliament Building) వేదికగా సభాకార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), ఇతర ఎంపీలు కొత్త భవనానికి ర్యాలీగా తరలివెళ్లారు. అంతకుముందు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాల్‌ (Central Hall)లో పార్లమెంటు గొప్ప వారసత్వాన్ని స్మరించుకునే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar) ప్రసంగించారు. పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగేలా ఆటంకాలను ఆయుధాలుగా మలచుకునే వ్యూహానికి ముగింపు పలికేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. అటువంటి చర్యలు.. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ఇక భారత్‌ ప్రయాణం కొత్త పార్లమెంట్‌లో.. పాత భవనం నుంచి తరలివెళ్లిన ఎంపీలు

‘ప్రజాస్వామ్య దేవాలయాల్లో నిబంధనల అతిక్రమణలను వదులుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెడుతోన్న వేళ.. పరస్పర సహకారాన్ని, ఏకాభిప్రాయ విధానాన్ని సభ్యులు పెంపొందించుకోవాలి. ఘర్షణాత్మక వైఖరికి వీడ్కోలు పలికేందుకు, జాతీయ ప్రయోజనాలను ఉన్నతంగా ఉంచాలని నిర్ణయించుకునేందుకు ఇదే సమయం. దీంతోపాటు పార్లమెంటరీ పనితీరులో ఆటంకాలను ఆయుధాలుగా మార్చుకోవడమనే వ్యూహాన్ని పక్కనపెట్టేందుకు ఇదే సరైన సమయం’ అని ధన్‌ఖడ్‌ స్పష్టం చేశారు. ఇవి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైనవని, వాటికి ప్రజల ఆమోదం ఎప్పటికీ ఉండదని చెప్పారు. మరోవైపు.. కొత్త పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని