Airport: ప్రయాణికురాలి బాంబు బూచి.. విమానాశ్రయంలో కలకలం!

తన బ్యాగులో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికురాలు ముంబయి విమానాశ్రయంలో కలకలం సృష్టించారు. పరిమితికి మించి లగేజీకి ఛార్జీలు చెల్లించమన్నందుకే ఆమె ఈ విధంగా వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు.

Published : 02 Jun 2023 15:25 IST

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (Mumbai Airport)లో ఓ ప్రయాణికురాలు చేసిన హడావుడి కలకలం రేపింది. పరిమితికి మించి లగేజీ తీసుకొచ్చిన ఆమె.. దానికయ్యే అదనపు ఛార్జీలను చెల్లించేందుకు నిరాకరిస్తూ, తన బ్యాగులో బాంబు (Bomb Threat)  ఉందని పేర్కొనడం భద్రతాసిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. చివరకు అలాంటిదేమీ లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదైంది.

దక్షిణ ముంబయికి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి కోల్‌కతా వెళ్లేందుకుగానూ ఇటీవల ముంబయి విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్‌ ఇన్‌ కౌంటర్‌ వద్ద తన లగేజీ అప్పగించారు. వాటి బరువు 22.05 కిలోలుగా నమోదైంది. అయితే, ఎయిర్‌లైన్ నిబంధనల ప్రకారం.. ఒక్కో దేశీయ ప్రయాణికుడు గరిష్ఠంగా 15 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. దీంతో అదనపు లగేజీ కోసం డబ్బులు చెల్లించాలని కోరగా.. ఆమె నిరాకరించారు. ఈ క్రమంలోనే ఎయిర్‌లైన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. 

అంతలోనే తన ఒక బ్యాగ్‌లో బాంబు ఉందని ఆమె పేర్కొనడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమె బ్యాగును క్షుణ్నంగా తనిఖీ చేయగా.. అలాంటిదేమీ లేదని తేలింది. ఈ వ్యవహారం విమానాశ్రయంలో కాసేపు భయాందోళనలకు దారితీసిందని అధికారులు చెప్పారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇతరుల ప్రాణాలకు, భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించారన్న అభియోగాలపై.. ఆమెపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు