Jammu Kashmir: కశ్మీర్‌ లోయలో మరో ఎన్‌కౌంటర్‌.. కీలక ఉగ్రవాది హతం

కశ్మీర్‌ లోయలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద మూకలను భద్రతాదళాలు ఏరిపారేస్తున్నాయి.

Published : 13 Oct 2021 17:07 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద మూకలను భద్రతాదళాలు ఏరిపారేస్తున్నాయి. తాజాగా జమ్ము-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో జైషే-ఈ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది శామ్ సోఫీ మరణించినట్లు ఐజీపీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. పుల్వామాలోని అవంతిపురలో ఉన్న తుల్రాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి ఉన్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది. ఈ మేరకు అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద ముఠా నాయకుడిని మట్టుబెట్టామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఉగ్రవాదులు భద్రతా దళాలపై ఎదురుకాల్పులు జరపడంతో ఓ భద్రతా సిబ్బంది కూడా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

కశ్మీర్‌లో వరుస ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతాదళాలు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దాదాపు 700 మంది ఉగ్ర సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం షోపియాన్‌ జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సోమవారం బందిపొరా, అనంత్‌నాగ్‌లో నిర్వహించిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని