Wrestlers Protest: అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ.. రెజ్లర్ల 5 డిమాండ్లు

Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు నేడు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు 5 డిమాండ్లను వినిపించినట్లు తెలుస్తోంది. 

Updated : 07 Jun 2023 13:55 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఆందోళనపై స్పందించిన కేంద్రప్రభుత్వం వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో రెజ్లర్లు నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడంతో పాటు రెజ్లింగ్‌ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలిని నియమించాలని వారు డిమాండ్‌ చేశారు.

రెజ్లర్ల ఆందోళనపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అర్ధరాత్రి ఓ ట్వీట్ చేశారు.  ‘‘రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఆహ్వానాన్ని రెజ్లర్లు అంగీకరించారు. ఈ ఉదయం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్‌ చర్చల నిమిత్తం అనురాగ్‌ ఠాకూర్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రెజ్లర్లు 5 డిమాండ్లను కేంద్రమంత్రి ముందుంచినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ డిమాండ్లు ఇలా ఉన్నాయి..

  • భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.
  • బ్రిజ్‌ భూషణ్‌ గానీ, ఆయన కుటుంబసభ్యులు గానీ రెజ్లింగ్‌ సమాఖ్యలో భాగం కాకూడదు.
  • రెజ్లింగ్‌ సమాఖ్యలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలక మండలికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.
  • ఏప్రిల్‌ 28న జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా మాపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలి.
  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి.

కాగా.. ప్రభుత్వంతో రెజ్లర్లు చర్చలు జరపడం వారంలో ఇది రెండోసారి. గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో తమకు ఆశించిన ఫలితం దక్కలేదని బజ్‌రంగ్ పునియా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని