దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..

దేశరాజధానిలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో వారం రోజుల పాటు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 19 Apr 2021 13:34 IST

దిల్లీ: దేశరాజధానిలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేటి రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది. ఈ మేరకు కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. అంతకుముందు లాక్‌డౌన్‌పై కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమై చర్చించారు.

ఈ లాక్‌డౌన్‌ సమయంలో..
‘దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా రోజుకు దాదాపు 25వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు, ఇన్‌ఫెక్షన్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. నిత్యం ఈ స్థాయిలో రోగులు వస్తే వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఈ ఆరు రోజుల లాక్‌డౌన్‌ కాలంలో ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచే చర్యలు చేపడతాం. ఈ లాక్‌డౌన్‌ కాలంలో ఆక్సిజన్‌, మందులు సమకూర్చే ఏర్పాట్లు చేస్తాం. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరుతున్నా. ఇలాంటి సమయంలో మాకు సాయం చేస్తున్నందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. 

వారికి చేతులెత్తి మొక్కుతున్నా..
‘లాక్‌డౌన్‌లో భాగంగా నిత్యావసరాలు, ఆహార సంబంధిత, వైద్యం సహా ఇతర అత్యవసర సేవలు కొనసాగుతాయి. ప్రైవేటు కార్యాలయాలన్నీ వర్క్‌ ఫ్రం హోం ద్వారానే నడిపేలా చర్యలు తీసుకోవాలి. వివాహ వేడుకలు కేవలం 50 మందితో మాత్రమే జరుపుకోవాలి. అందుకు ప్రత్యేకంగా పాసులు జారీ చేస్తాం. ఇక వలస కూలీల విషయానికొస్తే.. వారికి నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. ఇది ఆరురోజుల పాటు కొనసాగే చిన్న లాక్‌డౌన్‌ మాత్రమే. దయచేసి దిల్లీ వదిలి వెళ్లొద్దు. మళ్లీ దీన్ని పొడిగించాల్సిన అవసరం రాదని నేను భావిస్తున్నా. మిమ్మల్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది’ అని కేజ్రీవాల్‌ భరోసా కల్పించారు.  

కాగా, దిల్లీలో ఆదివారం 25,462 కరోనా కేసులు నమోదు కాగా, 161 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దిల్లీలో పాజిటివిటీ రేటు 30శాతంగా కొనసాగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికే దిల్లీలో వారాంతపు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు