Atal Tunnel: అటల్‌ సొరంగ మార్గంలో చిక్కుకున్న పర్యాటకులు

విపరీతంగా మంచుకురుస్తుండటంతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌ వద్ద అటల్‌ సొరంగ మార్గంలో వందలాది మంది పర్యాటకులు చిక్కుకున్నారు. పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దదారు.

Published : 31 Dec 2022 01:47 IST

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో వ్యూహాత్మకంగా నిర్మించిన అటల్‌ సొరంగ మార్గంలో దాదాపు 400 వందల వాహనాల్లోని పర్యాటకులు చిక్కుకున్నారు. రోహ్‌తంగ్‌ ప్రాంతంలోని మంచు విపరీతంగా కురుస్తుండటంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో సొరంగం దక్షిణ భాగం వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం అందుకున్న కీలాంగ్‌, మనాలీ నుంచి పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కొందరు పర్యాటకులు మాత్రం మంచును బాగా ఆస్వాదించినట్లు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడం వల్లే వాహనాలు అటల్‌ సొరంగ మార్గంలో చిక్కుకున్నాయని లాహుల్‌, స్పితి డిప్యూటీ కమిషనర్‌ సుమిత్‌ ఖిమ్‌తా వెల్లడించారు. స్థానికుల సాయంతో వారికి భోజన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పర్యాటకులు జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలని కులు డిప్యూటీ కమిషనర్‌ అషుతోష్‌ గార్గ్‌ వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు వేల మంది పర్యాటకులు మనాలి వస్తుంటారు. వందల వాహనాలు రాకపోకలు సాగించడం, మరోవైపు మంచు విపరీతంగా కురుస్తుండటంతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతుంది. సిమ్లా, చంబా, కిన్నౌర్‌, లాహౌల్‌, స్పితి తదితర మార్గాల్లోనూ ట్రాఫిక్‌ జామ్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పర్యాటకుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ వసతి సదుపాయాలు లేవు. దీంతో చాలా మంది పర్యాటకులు హోటల్స్‌లో కాకుండా వివిధ చోట్ల బస చేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. చంబా జిల్లాలోని డల్హౌసీ, సలోనీ, చురాగ్‌  ప్రాంతాల్లో మంచు ప్రమాదకర స్థాయిలో కురుస్తోందని తెలిపారు. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొథి జిల్లాలో 15 సెంటీమీటర్లు, కల్పా, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో 5 సెంటీమీటర్లు,  పోహ్‌, సంగ్లా జిల్లాల్లో 4 సెంటీమీటర్లు, గోండా, షిల్లారో జిల్లాల్లో 3 సెంటీమీటర్ల చొప్పున మంచుకురిసినట్లు అక్కడి వాతావరణ విభాగం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని