వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్‌ దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం చివరిసారిగా వైట్‌హౌస్‌ను వీడారు. తన సతీమణి మెలానియాతో కలిసి ఆయన వైట్‌హౌజ్‌ నుంచి బయటకు వైదొలిగారు. దీంతో ట్రంప్‌ నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని దాటవేసినట్లయింది. వైట్‌హౌజ్‌ నుంచి వారు నేరుగా మేరీల్యాండ్‌లోని మిలిటరీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరారు.

Updated : 20 Jan 2021 20:10 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం చివరిసారిగా వైట్‌హౌస్‌ను వీడారు. తన సతీమణి మెలానియాతో కలిసి ఆయన వైట్‌హౌస్‌ నుంచి బయటకు వైదొలిగారు. దీంతో ట్రంప్‌, నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని దాటవేసినట్లయింది. అక్కడి నుంచి వారు నేరుగా మేరీల్యాండ్‌లోని మిలిటరీ ఎయిర్‌బేస్‌కు బయలుదేరారు. అక్కడ ఆయన చివరిసారిగా ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’ విమానం ఎక్కి ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ సమీపంలో తన మార్‌ లాగో రిసార్టుకు వెళ్లనున్నారు. కాగా ట్రంప్‌ అధ్యక్షుడిగా చివరి రోజున శ్వేత సౌధం మాజీ ఉన్నతాధికారి స్టీవ్‌ బ్యానన్‌ సహా 73 మందికి క్షమాభిక్ష ప్రకటించారు. మరో 70 మందికి శిక్షను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వైట్‌హౌస్‌ను వీడి ఫ్లోరిడా బయలుదేరే క్రమంలో ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగొస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ‘మిలిటరీ ఎయిర్‌ బేస్‌’ వద్ద ఉన్న తన కుటుంబసభ్యులు, మద్దతుదారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ఈ నాలుగు సంవత్సరాలు అద్భుతమైనవి. ఈ కాలంలో మేం చాలా సాధించాం. స్పేస్‌ ఫోర్స్‌ ఏర్పాటు సహా పరిపాలనలో ఎన్నో విజయాలు సాధించాం’’ అని చెప్పారు. ఈ సందర్భంగా తనకు తోడ్పాటునందించిన కుటుంబసభ్యులు, మిత్రులు, సిబ్బందికి ట్రంప్‌ ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ఆయన సతీమణి కరెన్‌లకు కృతజ్ఞతలు చెప్పారు. 

అనంతరం బైడెన్‌ పేరు ప్రస్తావించకుండా కొత్తగా ఏర్పడనున్న పాలకవర్గానికి ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు.  ‘డెమోక్రాట్లు తమ పాలనలో పన్నులు పెంచకుండా ఉంటారని ఆశిస్తున్నా. అధ్యక్షుడిగా మీకు సేవలందించడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఏదో ఒక రూపంలో మళ్లీ తిరిగొస్తాం’ అని ట్రంప్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రథమ మహిళ హోదాలో మెలానియా చివరిగా మాట్లాడుతూ.. ‘దేశానికి ప్రథమ మహిళ హోదాలో ఉండటం గౌరవప్రదంగా భావిస్తున్నా’ అని చెప్పారు. 
 

ఇదీ చదవండి

మరో 73 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని