ఇండోనేసియా విషాదం:బ్లాక్‌బాక్సుల జాడ లభ్యం

అదృశ్యమైన ఇండోనేసియా విమానానికి చెందిన రెండు బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యమైంది.

Updated : 10 Jan 2021 17:50 IST

జకార్తా: శనివారం మధ్యాహ్నం అదృశ్యమైన ఇండోనేసియా విమానానికి చెందిన రెండు బ్లాక్‌ బాక్సుల ఆచూకీ లభ్యమైంది. సిగ్నల్స్‌ను బట్టి వాటిని త్వరలోనే వెలికితీస్తామని అక్కడి అధికారులు అంటున్నారు.  జకార్తాలో బయల్దేరిన సదకె ఎస్‌జే 182 విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆచూకీ లేకుండా పోయింది. అనంతరం నేటి ఉదయం లాంకాంగ్‌, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తులు లభ్యమయ్యాయి. దీనితో ఆ విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

శ్రీవిజయ ఎయిర్‌కు చెందిన ఈ జెట్‌ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు, సిబ్బందితో సహా మొత్తం 62 మంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు టేకాఫ్‌ అయిన ఈ విమానం.. నాలుగు నిమిషాల్లో 10వేల 900 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అనంతరం ఉన్నట్టుండి కిందకు పడిపోవటం మొదలై.. 21 సెకన్ల తర్వాత గ్రౌండ్‌ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.  కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంతవరకూ తెలియరాలేదు. సదరు విమానాన్ని నడుపుతున్న పైలట్లు 10ఏళ్లకు పైగా అనుభవమున్నవారని అధికారులు తెలిపారు. బ్లాక్‌బాక్సులను వెలికితీసి, పరిశీలన చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు లభ్యమవుతాయని సైన్యాధ్యక్షుడు హదీ జజాంటో అంటున్నారు.  

కాగా, ఇతర దేశాల కంటే ఇండోనేసియాలో విమాన ప్రమాదాలు అధికమేనని ఏవియేషన్‌ సేఫ్టీ నెట్‌వర్క్‌ గణాంకాలు చెబుతున్నాయి. వరుస ప్రమాదాలు చోటుచేసుకున్న కారణంగా.. ఈ దేశానికి చెందిన అన్ని విమానాలపై యూరోపియన్‌ యూనియన్‌ 2007లో నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2018 వరకు అమలులో ఉన్నాయి.

ఇవీ చదవండి..

ఇండోనేసియా విమానం.. దాదాపు విషాదాంతం

 చిమ్మచీకట్లలో పాక్‌..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని