IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్‌!

జమ్ములోని కల్చుక్‌లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్‌, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్‌కాప్టర్‌లే.

Updated : 28 Jun 2021 14:33 IST

‘రెక్కలు’తొడిగిన ఉగ్రవాదం..!

కల్చుక్‌ సైనిక స్థావరం వద్ద మరో రెండు డ్రోన్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జమ్ములోని కల్చుక్‌లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్‌, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్‌కాప్టర్‌లే. వీటిపై జవాన్లు 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. కానీ చీకట్లో అవి వేగంగా తప్పించుకొన్నాయి. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారం ఆందోళనకరంగా మారింది. దీంతో సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రదేశంలో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 

100 మీటర్ల ఎత్తు నుంచి దాడి

జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడి వివరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇందులో రెండు డ్రోన్లు పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్‌ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. దాడి చేసిన అనంతరం అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. వీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి వినియోగించి ఉండొచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ బృందాలు అనుమానిస్తున్నాయి. వీటిని పాకిస్థాన్‌ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్‌ నుంచే  ఆపరేట్‌ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ తేలిక పాటి డ్రోన్లు 100- 150 మీటర్ల ఎత్తు నుంచి పేలుడు పదార్థంతో చీకటిలో ప్రయాణించాయి. ఈ కారణంగానే అవి లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయాయని  నిపుణులు చెబుతున్నారు. అదే భారీ డ్రోన్లు వస్తే నష్ట తీవ్రత ఎక్కువగానే ఉండేదని వెల్లడించారు. 

భారత్‌లోనే ఆరు లక్షలు..!

ఇటీవల కాలంలో సరిహద్దుల వద్ద డ్రోన్ల సంచారం పెరిగిపోయింది. మరోవైపు చైనా కూడా డ్రోన్ల వినియోగంలో చాలా ముందుంది. ఇక భారత్‌లో డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఎక్కడా నిబంధనలు అమలు చేస్తున్నట్లు కనిపించదు. 2019లో వివిధ భద్రతా సంస్థలు నిర్వహించిన సర్వేలో దేశంలో 6 లక్షలకు పైగా వివిధ సైజులు, సామర్థ్యాలు ఉన్న డ్రోన్లు ఉన్నట్లు తేలింది. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల చేతిలో పడితే విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లే. సరిహద్దు నగరాలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. కంపెనీలు, విమనాశ్రయాలకు భధ్రత కల్పించే సీఐఎస్‌ఎఫ్‌ స్నైపర్లు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర భద్రతా సిబ్బందికి వీటిపై ఎలా స్పందించాలనే అంశంపై ఎస్‌వోపీ(స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)ను వాయుసేన సహకారంతో తయారు చేయాల్సివుంది. భారత్‌ వద్ద వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీ లేదు. 

చిన్నవి, రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్లతోనే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. రూ.20వేలకు దొరికే వాణిజ్య శ్రేణి డ్రోన్లు కూడా 5 కేజీల వరకు బరువును మోయగలవు. ఇవి మన సైనిక రాడార్లలో ఒక చిన్న పక్షివలే కనిపిస్తాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని కూల్చడానికి భారీ రాకెట్లను, క్షిపణులను ప్రయోగించడం అంటే వనరుల్ని వృథా చేసుకోవడమే. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు స్కైఫెన్స్‌, అథెనా, డ్రోన్‌క్యాచర్‌, స్కైవాల్‌ 100 వంటి టెక్నాలజీలను పరిశీలిస్తున్నాయి.

భారత్‌ ముందున్న మార్గాలు..

సాధారణంగా సైనిక స్థావరాల్లో ఫైటర్‌ జెట్లను పేలుళ్లకు తట్టుకొనే హ్యాంగర్లలో భద్రపరుస్తారు. కానీ రాడార్లు, ఇతర కమ్యూనికేషన్‌ సామగ్రి మాత్రం బాహ్య ప్రదేశంలో ఉండాల్సిందే. దీంతో వీటికి డ్రోన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను గుర్తించే రాడార్లను రంగంలోకి దించడం, లేజర్స్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌గన్స్‌ను మోహరించడం వంటివి చేయవచ్చు. ఈ గన్స్‌ నిమిషానికి 4,600 రౌండ్లు ఫైర్‌ చేయగలవు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని