కిడ్నాపైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరు సురక్షితం!

అస్సాంలో మూడ్రోజుల కిందట అపహరణకు గురైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నాగాలాండ్‌లోని భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు.

Published : 24 Apr 2021 14:31 IST

గువహటి: అస్సాంలో మూడు రోజుల కిందట అపహరణకు గురైన ఓఎన్జీసీ ఉద్యోగుల్లో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. నాగాలాండ్‌లోని భారత్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా సిబ్బంది వారిని సురక్షితంగా కాపాడారు. మరో ఉద్యోగి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ మేరకు అస్సాం పోలీస్‌ చీఫ్‌ భాస్కర్‌ జ్యోతి మహంత తెలిపారు. 

‘నాగాలాండ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. అనంతరం ఇద్దరు ఓఎన్జీసీ ఉద్యోగుల్ని అక్కడి నుంచి కాపాడగలిగాం. ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. ఇది యూఎల్‌ఎఫ్‌ఏ ఉగ్రవాదుల కుట్రగా అనుమానిస్తున్నాం. ఘటనా స్థలం నుంచి వారు పారిపోయే క్రమంలో మూడో వ్యక్తి రితుల్‌ సైకియా వెంట తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి సరిహద్దు ప్రాంతం 6 కిలోమీటర్లు ఉంటుంది. అటవీ ప్రాంతం కాబట్టి సరిహద్దు దాటడం అంత సులువైన పని కాదు. మూడో వ్యక్తి కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది’ అని మహంత చెప్పారు. 

ఈ ఆపరేషన్‌ను ఇంటెలిజెన్స్‌ సూచనలతో నాగాలాండ్‌ పోలీసులు, భారత సైన్యం, ఇతర పారామిలిటరీ బలగాలు సంయుక్తంగా కొనసాగిస్తున్నట్లు మహంత వెల్లడించారు. కిడ్నాప్‌ నుంచి విముక్తి పొందిన ఉద్యోగుల్ని మోహన్‌ గొగొయి, అలకేష్‌ సైకియాలుగా గుర్తించినట్లు తెలిపారు. అస్సాంలోని శివసాగర్‌ జిల్లాలో బుధవారం నాడు ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగుల్ని కిడ్నాప్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని