BSF: రెండు పాకిస్థాన్‌ డ్రోన్లను కూల్చిన భారత్‌

భారత్‌వైపు మాదక ద్రవ్యాలను మోసుకొస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లను పంజాబ్‌ బోర్డర్‌లో భారత్‌ సరిహద్దు భద్రతా దళాలు కూల్చివేశాయి. రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగిన ఈ ఘటనల్లో దాదాపు 10 కేజీల హెరాయిన్‌ను దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Updated : 29 Nov 2022 23:31 IST

చండీగఢ్‌: భారత్‌వైపు మాదకద్రవ్యాలను మోసుకొస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్లను పంజాబ్‌ బోర్డర్‌లో భారత్‌ సరిహద్దు భద్రతా బలగాలు నేల కూల్చాయి. రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగిన ఈ ఘటనల్లో దాదాపు 10 కిలోల హెరాయిన్‌ను దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తొలి ఘటన అమృత్‌సర్‌ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న మహిళా భద్రతా సిబ్బంది.. ఓ అనుమానిత డ్రోన్‌ పాకిస్థాన్‌ నుంచి భారత్‌వైపు రావడాన్ని గమనించారు. వెంటనే కాల్పులు జరిపి దానిని కూల్చివేశారు. ఈ ఘటనలో 3.11 కిలోల మాదకద్రవ్యాలు బయటపడ్డాయి. భారత్‌-పాక్‌ సరిహద్దులో ఉన్న తరన్‌తారన్‌ జిల్లాలో మరో డ్రోన్‌నూ బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేశారు. కలాష్‌ హవేలియన్‌ వద్ద దాదాపు 6.6 కిలోల హెరాయిన్‌తో భారత్‌లోకి వస్తున్న డ్రోన్‌ను గుర్తించి కూల్చివేసినట్లు బీఎస్ఎఫ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు  భద్రతా సిబ్బందికి  ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు, వడాయ్‌ చీమా సరిహద్దులో సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఓ అనుమానిత డ్రోన్‌ భారత్ వైపు రావడాన్ని గమనించి.. సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో అది తిరిగి పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. గత శుక్రవారం అమృత్‌సర్‌ సమీపంలో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భద్రతాబలగాలు నేలకూల్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని