అప్పటికల్లా యూకేలో ప్రతి ఒక్కరికీ టీకా!

దేశంలో ప్రతిఒక్కరికీ సెప్టెంబర్‌కల్లా కరోనా టీకా అందచేసే దిశగా బ్రిటన్‌ ప్రభుత్వం చర్యలు

Published : 18 Jan 2021 22:33 IST

లండన్‌: దేశంలోని ప్రతిఒక్కరికీ కరోనా టీకా అందించేందుకు యూకే‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సెప్టెంబర్‌ నాటికి మాత్రం వైద్యరోగ్య సిబ్బంది, కరోనా యోధులతో సహా 70 ఏళ్లకు పైబడిన ప్రతిఒక్కరికీ కనీసం ఒక్క డోసు టీకా ఐనా అందించేందుకు ఆ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచంలోనే ఐదో స్థానంలో..

యూకే‌ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో కొవిడ్‌ మహమ్మారి ఆ దేశంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇప్పటి వరకు  అక్కడ 88,747 మరణాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య యూరోప్‌లోనే అత్యధికం.  అంతర్జాతీయంగా ఐదో స్థానంలో ఉంది. కరోనా కొత్త స్ట్రెయిన్‌ వ్యాపించడంతో జనవరి 2 నుంచి దేశంలో మరోసారి నిరవధిక లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి 30 క్షణాలకు ఒక కొవిడ్‌ బాధితుడు వైద్యశాలలో చేరుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. యూకే వైద్యారోగ్య సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరిగిపోయింది. కొత్త స్ట్రెయిన్‌తో యూకే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది.

సవాలుగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

ఈ నేపథ్యంలో యూకేలో‌ కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుంది. దేశంలో ఉన్న 51 మిలియన్ల (5 కోట్ల 10 లక్షలు) వయోజనులందరికీ సెప్టెంబర్‌కల్లా టీకా తొలిడోసు అందచేయటమే తమ లక్ష్యమని.. విదేశాంగ శాఖా మంత్రి డొమినిక్‌ రాబ్‌ వెల్లడించారు. ఇందుకు గాను రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని కొత్త కరోనా టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే రోజంతా వ్యాక్సిన్లు అందచేసే వెసులుబాటు కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

తొలి విడత పంపిణీ అనంతరం.. 50 ఏళ్లు పైబడిన వారికి, ఆపైన 18 ఏళ్లు పైబడిన వారికి టీకా అందచేయటం యూకే‌ కరోనా కట్టడి వ్యూహంలో భాగంగా ఉంది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌, మోడెర్నా టీకాలకు అనుమతి మంజూరు చేయగా.. ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ టీకాల పంపిణీ ఇప్పటికే మొదలైంది. మిగిలిన దేశాలకు విభిన్నంగా.. మరింత ఎక్కువ మందికి టీకా అందాలనే ఆలోచనతో యూకేలో డోసుల మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 12 వారాలకు పెంచింది.

ఇదీ చదవండి..

అమెరికాలో అది సాధ్యమే: ఫౌచీ

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు