Video: మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరికొట్టిన మాజీ సీఎం!

రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ (Liquor ban demand) కొంత కాలంగా ఉద్యమిస్తోన్న ఆమె ఈసారి ఓ మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.......

Published : 16 Jun 2022 01:56 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, భాజపా ఫైర్‌ బ్రాండ్‌ ఉమా భారతికి (Uma Bharti) మరోసారి కోపమొచ్చింది. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ (Liquor ban demand) కొంత కాలంగా ఉద్యమిస్తోన్న ఆమె ఈసారి ఓ మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరమైన ఓర్చాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన స్థలానికి అనుమతి లేదని, ఎంతో పవిత్ర నగరమైన ఓర్చాలో ఇలాంటి దుకాణం తెరవడం నేరమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె పేడ విసిరిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో తీసిన వ్యక్తితో ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఆమె అన్నట్టుగా రికార్డయింది. ఈ ఏడాది మార్చిలో భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంపై రాళ్లతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే.

నిన్నటి ఘటన తర్వాత ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఓర్చా నగరం ప్రధాన ద్వారం వద్ద మద్యం దుకాణం ఉంది. ఇప్పుడు ఆ దుకాణం ఉన్న ప్రదేశంలో దానికి అనుమతి లేదు. దీనిపై ప్రజలు, మా సంస్థ సభ్యులు నిరంతరం నిరసనలు చేపడుతున్నారు. ఈ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. వినతి పత్రాలూ ఇస్తున్నారు. పవిత్రమైన నగరం నుదుటిన ఈ దుకాణం పెద్ద కళంకంగా ఉన్నందున దాన్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి వస్తోన్న స్పందనలను నేరంగా పేర్కొనలేం.. ఎందుకంటే అక్కడ ఈ దుకాణం తెరవడమే ఓ పెద్ద నేరం’’ అని పేర్కొన్నారు. 

‘‘ఏప్రిల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓర్చాలో నిర్వహించిన దీపోత్సవ్‌ కార్యక్రమం రోజున ఐదు లక్షల దీపాలు వెలిగించినప్పుడు ఈ దుకాణం తెరిచి ఉందని నాకు సమాచారం అందింది. ఇది అయోధ్యలా పవిత్రమైనది. అందుకే పవిత్రమైన గోశాలలోని ఆవుపేడను మద్యం దుకాణంపై విసిరికొట్టాను. అయినా మా భావజాలానికి చెందిన సంస్థలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఆ దుకాణం ఇంకా తెరిచి ఉంచడం సిగ్గుచేటు’’ అన్నారు. అయితే, ఈ మద్యం దుకాణం మంజూరైన స్థలంలోనే ఉందని ఓర్చా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జి అభయ్‌ సింగ్‌ అన్నారు. ఆవుపేడతో దాడి చేసిన తర్వాత కాంట్రాక్టర్‌ ఈ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని