భారత్‌ గ్లోబల్ లీడర్‌: ఐరాస

కొవిడ్‌ మహమ్మారిపై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కొనియాడారు. ఈ విషయంలో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు.........

Updated : 21 Feb 2021 15:30 IST

న్యూయార్క్‌: కొవిడ్‌ మహమ్మారిపై యావత్తు ప్రపంచం చేస్తున్న పోరులో భారత్‌ పోషిస్తున్న పాత్రను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కొనియాడారు. ఈ విషయంలో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా వ్యవహరిస్తోందని ప్రశంసించారు. ఐరాస శాంతిపరిరక్షక దళానికి భారత్‌ రెండు లక్షల కరోనా టీకాల డోసులు ఉచితంగా అందించనున్నట్లు విదేశాంగ మంత్రి జయశంకర్‌ ఇటీవల ప్రకటించారు. దీనికిగానూ గుటెరస్‌ కృతజ్ఞతలు తెలుపుతూ జయశంకర్‌కు ఫిబ్రవరి 17న లేఖ రాశారు. ఈ విషయాన్ని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్‌.తిరుమూర్తి ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

కరోనా అంతానికి భారత్‌ చేపడుతున్న చర్యలను గుటెరస్‌ లేఖలో ప్రత్యేకంగా ప్రశంసించారు. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నుంచి ప్రపంచ దేశాలకు భారత్‌ అందిస్తున్న సేవల్ని గుర్తుచేశారు. కీలక ఔషధాలు, మెడికల్‌ కిట్లు, వెంటిలేటర్లు వంటివి అందిస్తూ కరోనాపై పోరులో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా కాలంలో దాదాపు 150 దేశాలు భారత్‌ నుంచి లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. యావత్తు ప్రపంచానికి అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ భారత్‌ తయారీ సామర్థ్యం వల్లే సాధ్యమైందని తెలిపారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే అనుమతులిచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీని వినియోగానికి మార్గం సుగమమైంది. అలాగే ప్రపంచదేశాలకు సమానంగా కరోనా టీకా అందించాలన్న ఉద్దేశంతో ఐరాస నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ బలోపేతానికీ భారత్‌ సహకరిస్తోందని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని