హోటల్‌పై చెడుగా రివ్యూ ఇచ్చాడని జైలుకు..

ఏదైనా హోటల్‌కి వెళ్లాలంటే ఇటీవల కాలంలో ఆ హోటల్‌కు వచ్చిన రివ్యూలను చూసి అక్కడికి వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్నారు. సినిమాలకే కాదు, ఇలా హోటల్‌ సేవలపై రివ్యూలకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి

Updated : 11 Oct 2020 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా హోటల్‌కి వెళ్లాలంటే ఇటీవల కాలంలో ఆ హోటల్‌కు వచ్చిన రివ్యూలను చూసి అక్కడికి వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకుంటున్నారు. సినిమాలకే కాదు, ఇలా హోటల్‌ సేవలపై రివ్యూలకు కూడా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే అమెరికాకు చెందిన ఓ వ్యక్తి థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌పై చెడుగా రివ్యూ ఇచ్చాడట. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. హోటల్‌ సేవలు నచ్చకపోతే నచ్చలేదనే చెబుతారు. ఆ మాత్రానికే జైల్లో పెడతారా అని ఆశ్చర్యపోతున్నారా? అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరే చదవండి..

అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన కథనం ప్రకారం.. అమెరికాకు చెందిన వెస్లే బార్న్స్‌ థాయ్‌లాండ్‌లో ఇంగ్లీష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు కో చాంగ్‌ ఐలాండ్‌లోని సీ వ్యూ కో చాంగ్‌ రిసార్ట్‌ హోటల్‌కు వెళ్లాడట. అక్కడ అతడికి వైన్‌ బాటిల్‌ తెచ్చి ఇచ్చినందుకు సర్వీస్‌ ఛార్జ్‌ కింద 15 యూఎస్‌ డాలర్లు బిల్‌ వేయడంతో అతడు హోటల్‌ సిబ్బందితో గొడవకు దిగాడు. దీంతో అదనపు ఛార్జీ రద్దు చేసి సమస్యను హోటల్‌ యాజమాన్యం పరిష్కరించింది. అయితే, వెస్లే అంతటితో ఊరుకోలేదు. హోటల్‌పై పలుమార్లు దారుణమైన రివ్యూలు రాశాడు. ఆ హోటల్‌కు వెళ్లొద్దని, అక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందని రాసుకొచ్చాడు. ఈ విషయం హోటల్‌ యాజమాన్యానికి తెలియడంతో అతడిపై దావా వేసింది. కనీసం ఏడేళ్లు జైలు శిక్ష విధించాలని కోరింది. పోలీసులు వెస్లేని గత నెలలో అరెస్టు చేసి జైలుకి పంపారు. అయితే రెండు రోజులు జైల్లో ఉన్న అతడు బెయిల్‌పై బయటకొచ్చాడు. విచారణ పూర్తయ్యాక అతడికి కనీసం రెండేళ్లు జైలుశిక్ష పడొచ్చని అక్కడి న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ విషయంపై హోటల్‌ యాజమాన్యం మాట్లాడుతూ.. దావా వేసేముందు వెస్లేతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నించామని వెల్లడించింది. కానీ, వెస్లే నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో దావా వేయాల్సి వచ్చిందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని