
Joe Biden: భారత్లో అయిదుగురు బైడెన్లు ఉన్నారన్న అమెరికా అధ్యక్షుడు..
వారు మీ బంధువులే అని చమత్కరించిన మోదీ
వాషింగ్టన్ : భారత దేశంలో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరదాగా మాట్లాడారు. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. 1972లో సెనెటర్గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు బైడెన్ అని పేర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెబుతూ.. ఆ మరుసటి రోజే భారత్లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెపుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన భారత ప్రధాని మోదీ... ‘వారు మీ బంధువులే’ అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.
శుక్రవారం ఉదయం శ్వేతసౌధానికి చేరుకున్న భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇద్దరు నేతలు ముఖాముఖీ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇప్పటి వరకూ ఫోన్ ద్వారా సంభాషించుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.