corona: కొవిడ్తో కంటి కణాలకు ముప్పు
వివిధ మార్గాల ద్వారా మానవ శరీరంలోకి చొరబడుతున్న కరోనా మహమ్మారి కంటి నుంచి కూడా మన శరీరంలోకి ప్రయాణిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ క్రమంలో వైరస్ కంటిలోని కణాలను నాశనం చేస్తుందని గుర్తించారు.
వాషింగ్టన్: వివిధ మార్గాల ద్వారా మానవ శరీరంలోకి చొరబడుతున్న కరోనా మహమ్మారి కంటి నుంచి కూడా మన శరీరంలోకి ప్రయాణిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ క్రమంలో వైరస్ కంటిలోని కణాలను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్ సైనాయ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనను నిర్వహించారు. మన కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకొని వైరస్ శరీరంలోకి ప్రయాణిస్తుందని వారు పేర్కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన పరిశోధనా పత్రాలు సెల్ స్టెమ్ సెల్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. సార్స్-కోవ్2 కంటి ద్వారా ప్రయాణించేటపుడు కంటిలోని పై కణాలను నాశనం చేస్తుందని ఆ పరిశోధనలో వెల్లడైంది. అక్కడి నుంచి ఏసీఈ2 ద్వారా వైరస్ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు తెలిపారు. కంటిలోని ముందు భాగమైన లింబస్ వైరస్కు ఎక్కువగా ప్రభావితం అవుతుండగా, కార్నియాకు తక్కువ ముప్పు ఉంటుందని వారు వెల్లడించారు. ఈ పరిశోధన ఆధారంగా కరోనాను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పరిశోధకుల్లో ఒకరూన టిమోతీ బ్లెంకిన్సోప్ అన్నారు. ముఖంలోని ప్రతి భాగమూ వైరస్ను శరీరంలోకి పంపేందుకు ఒక సాధనంగా మారుతుందన్నారు. తరచూ చేతులు శుభ్రపరచుకోవడంతో పాటు ముఖం భాగాన్ని తాకకుండా ఉండాలని ఆయన సూచించారు. ఫేస్ షీల్డ్ల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా విట్రో స్టెమ్ సెల్ నమూనాలను వినియోగించారు. కరోనా బారిన పడిన వారి నుంచి నమూనాలను సేకరించి ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ చేసి విశ్లేషించినట్లు పరిశోధకులు తెలిపారు. కంటిలోని లోపలి, ప్రాథమిక కణజాలంపై వైరస్ ప్రభావాన్ని గుర్తించినట్లు వారు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.