ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: అమెరికా

ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్ని విభేదాలను పరిష్కరించుకునేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా 2015 నాటి అణు ఒప్పందాన్ని.......

Published : 19 Feb 2021 13:23 IST

వాషింగ్టన్‌ : ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్ని విభేదాలను పరిష్కరించుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా 2015 నాటి అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ట్రంప్‌ హయాంలో అమెరికా వైదొలిగిన విషయం తెలిసిందే.

ఒప్పందంలోని నిబంధనలకు కట్టుబడేందుకు ఇరాన్‌ అంగీకరిస్తే తిరిగి డీల్‌లో చేరతామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన బృందం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలు ఇటీవల పంపిన ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెగ్‌ ప్రైస్‌ ప్రకటించారు. ఇరాన్‌ నిబంధనలకు కట్టుబడి ఉంటామని హామీ ఇస్తే.. మరింత మెరుగైన, బలమైన, సుదీర్ఘ కాలం కొనసాగే ఒప్పందంపై చర్చిస్తామని తెలిపారు. ఇటీవల సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ఇటీవల ఒప్పందంలోని ఇతర దేశాల ప్రతినిధులతో వర్చువల్‌గా మాట్లాడారు. దాని తర్వాతే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అమెరికా ప్రకటనపై ఐరోపా భాగస్వామ్య దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఇరాన్‌ అణ్వాయుధ తయారీని నిలువరించే సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ఐక్యరాజ్య సమితి భద్రతామండలి శాశ్వత సభ్య దేశాలు అయిదింటితో పాటు జర్మనీ, అంతర్జాతీయ అణు శక్తి కమిషన్‌ ప్రతినిధులు, ఇరాన్‌ నేతలు కలిసికట్టుగా 2015లో రూపొందించారు. ఈ ఒప్పందం ప్రకారం అణు పదార్థ శుద్ధిపై పరిమితులు విధించారు. కానీ, ఈ ఒడంబడిక ఇరాన్‌కు అనుకూలంగా.. అమెరికాకు ఇబ్బందికంగా ఉందని ఆరోపిస్తూ ట్రంప్ 2018లోనే దీన్నుంచి వైదొలిగారు. ఇరాన్‌పై కఠిన ఆర్థిక-వాణిజ్య ఆంక్షల కొరడా ఝళిపిస్తూ వచ్చారు.

దీంతో అణు ఒప్పందంలోని కీలక నిబంధనలను ఇరాన్‌ సైతం క్రమంగా ఉల్లంఘిస్తూ వచ్చింది. ఈ క్రమంలో యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నట్లు ప్రకటించింది. యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. ఇక తమ దేశ అణు కార్యక్రమంపై ఎలాంటి పరిమితులు లేవని ఓ ప్రకటించుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలకు తలనొప్పిగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని