
ఇంకా చావు బతుకుల రేసులోనే ఉన్నాం: బైడెన్
వాషింగ్టన్: కరోనా వైరస్ విషయంలో అమెరికా ఇప్పటికీ చావు బతుకుల రేసులోనే ఉందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా కరోనా వ్యాప్తిని నివారించేలా జాగ్రత్తలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 75 రోజుల్లో 150 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేసిందన్నారు. ఈ మేరకు వర్జీనియాలోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రం సందర్శన సందర్భంగా బైడెన్ వెల్లడించారు. తొలుత బైడెన్ ప్రభుత్వం వందరోజుల్లో వంద మిలియన్ డోసులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ లక్ష్యాన్ని 200 మిలియన్లకు పెంచుతూ నిర్దేశించారు.
‘కరోనా వైరస్ విషయంలో అమెరికా ఇంకా చావు బతుకుల రేసులోనే ఉంది. అనుకున్న లక్ష్యం కోసం మనం ఎంతో శ్రమించాల్సి ఉంది. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు అందరూ సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు విధిగా నిర్వర్తించాలి. జులై 4వ తేదీలోపు మంచి రోజులు వస్తాయి. ఆలోపు ఎంతమందిని కాపాడుకుంటామనేది ముఖ్యం. కాబట్టి ప్రతిఒక్కరూ తమ వంతు వచ్చినపుడు టీకాలు వేయించుకోండి. మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి’ అని బైడెన్ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 19 నుంచి దేశవ్యాప్తంగా వయోజనులందరికీ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత కల్పిస్తామన్నారు. ఇంకా కొత్త కేసులు పెరగడం, ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరగడంపై బైడెన్ విచారం వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకు 5,54,064 మంది కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.