Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్‌ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..

చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత.. ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభాల్లాంటివని అమెరికా (US) తెలిపింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై ‘అనర్హత వేటు’ అంశంపై స్పందిస్తూ అగ్రరాజ్యం ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 28 Mar 2023 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత (Disqualification) వేటు.. దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా దీనిపై అగ్రరాజ్యం అమెరికా (America) కూడా స్పందించింది. రాహుల్‌ గాంధీ కేసును తాము గమనిస్తున్నామని పేర్కొంది. అయితే, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌ (India)తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించింది. (Rahul Gandhi disqualification)

‘‘ఏ ప్రజాస్వామ్యానికైనా (Democracy).. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు. భారత కోర్టుల్లో రాహుల్‌ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలక అంశాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్‌ చేస్తూనే ఉంటాం’’ అని అమెరికా (US) విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘ఇందుకోసమా మా తాత జైలుకెళ్లింది..?’: రాహుల్‌ అనర్హతపై యూఎస్‌ చట్టసభ్యుడు

బోల్టే ఆశ్చర్యపోతాడు..: చిదంబరం సెటైర్‌

మోదీ (Modi) ఇంటి పేరును కించపర్చారన్న కేసులో మార్చి 23న గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు.. రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే లోక్‌సభ సెక్రటేరియేట్‌ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో కేంద్రం తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం (P Chidambaram) దీనిపై స్పందిస్తూ.. కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘రాహుల్‌ కేసులో తీర్పు.. ఆ వెంటనే అనర్హత పడటం అత్యంత అసాధారణం. ఈ వ్యవహారంలో కేంద్రం ప్రదర్శించిన వేగానికి ఉసెన్‌ బోల్ట్‌ (Usian Bolt) కూడా ఆశ్చర్యపోతాడు’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఓ అపవాదుకు రాహుల్‌ పరువునష్టం కేసును ఎదుర్కొన్నారని చిదంబరం ఈ సందర్భంగా అన్నారు. ‘‘కేవలం నిందలకు రెండేళ్ల జైలు శిక్ష పడితే.. ఇది ఎలాంటి చట్టమో అర్థం చేసుకోవచ్చు. కావాలనే ఓ చట్టాన్ని తీసుకొచ్చి.. దాంతో ప్రతిపక్ష నేత గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నించారు’’ అని కేంద్రాన్ని ఆయన దుయ్యబట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని