మొన్న జీన్స్‌పై.. ఇప్పుడు అమెరికా గురించి..

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం....

Updated : 22 Mar 2021 05:09 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణస్వీకారం చేసిన తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరు పిల్లల తల్లై ఉండీ ఒకావిడ చిరిగిన జీన్స్‌ వేసుకుందని, అలాంటావిడ సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేసి తొలిసారి వార్తలకెక్కారాయన. దీంతో నెట్టింట పెద్దఎత్తున చర్చ నడిచింది. అయితే, ఈ సారి అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నోరు జారి మరోసారి సోషల్‌మీడియాకు చిక్కారు. ‘జీన్స్‌’ అంశాన్నే ఇంకా మరిచిపోని నెటిజన్లు నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇంతకీ తీరత్‌సింగ్‌ ఏమన్నారంటే.. కొవిడ్‌ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మిన్నగా వ్యవహరించిందని తీరత్‌సింగ్‌ ఓ సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ‘మన దేశాన్ని 200 ఏళ్ల పాటు ఏలిన అమెరికా సైతం ఇవాళ కొవిడ్‌ కట్టడికి తీవ్రంగా శ్రమిస్తోంది’ అని అన్నారు. మోదీ మాత్రం కొవిడ్‌ కట్టడికి చర్యలు తీసుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొందరు మాత్రమే మాస్కు ధరించడం, శానిటైజర్‌ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అయితే, తన ప్రసంగంలో బ్రిటన్‌కు బదులు అమెరికా అని అనడంతో నెట్టింట ఆయనపై ఫన్నీ కామెంట్ల వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ‘మా చరిత్ర పుస్తకాల్లో ఇదెక్కాడా లేదే’ అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ కుమార్‌తో తీరత్‌ను పోలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని